ఒకే దేశం, ఒకే భాష అనే బీజేపీ నినాదాన్ని కేంద్రం బలవంతంగా దేశంపై రుద్దాలని ప్రయత్నిస్తున్నది.పార్లమెంట్ సాక్షిగా హిందీ సరిగా మాట్లాడటం రానివారిని పనికి రానివారిలాగా చిత్రీకరించే ప్రయత్నం ఒకింత తలవంపు చర్యే. రాజ్యాంగంలోని 29వ అధికరణం ప్రకారం పౌరులు తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతి సంప్రదాయాలు పాటించేందుకు స్వేచ్ఛ కలిగి ఉంటారని కేంద్రం తెలుసుకోవాలి.అన్ని భాషలను సమానంగా ఆదరించి, గౌరవించాలి.
బీజేపీ భాష విధానం దేశంలో మరోసారి అసమానతలకు, అవమానాలకు, హేళనకు తావిస్తుందనడానికి తాజా పార్లమెంట్ సన్నివేశమే చక్కని ఉదాహరణ. హిందీ రాకుంటే, హిందీ సరిగ్గా మాట్లాడకుంటే పనికిరాని వారిలా చిత్రీకరించడం, అవమానించి హేళన చేయడం అభ్యంతరకరం. స్వయాన ఓ పార్లమెంట్ సభ్యుడు తన భావనను వ్యక్తీకరిస్తున్న క్రమంలో బాధ్యత గల కేంద్ర మంత్రి ఆ సభ్యుడు మాట్లాడిన భాషను ప్రస్తావించి అవహేళన చేయడం భారత పార్లమెంటరీ వ్యవస్థకే అవమానం. హిందీ రాకుంటే దేశంలో ఏ వ్యక్తికీ బతికే పరిస్థితి ఉండదనే ధోరణిలో కేంద్రం వ్యవహరించడంపై భాషాభిమానుల్లో ముఖ్యంగా ప్రాంతీయ భాషావాదుల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వారికి చదవడం, మాట్లాడడం రాదనే అపోహ, అహంకారం కేంద్ర మంత్రిలో పేరుకుపోయి ఉంటుంది. హిందీయేతర మాతృభాష గల సభ్యుడిపై పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన తీరు, హిందీపై వల్లమాలిన ప్రేమ ఒలకబోసిన అంశం ఇప్పుడు చర్చకు వస్తున్నది. ఆ మాటకొస్తే భాషోద్యమం ఇప్పటికీ బలంగా ఉన్న తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి హిందీపై చూపిన ఆసక్తి బీజేపీ- కేంద్రం కుట్రలను బహిర్గతం చేస్తున్నది.
అసలు ఈ దేశానికి హిందీ అవసరమా? దేశమంతటా ఒకే భాష సాధ్యమేనా? అన్న చర్చను పక్కన పెట్టి ‘ఒకే దేశం-ఒకే భాష’ను బలవంతంగా అమలు చేసే కుట్ర మొదలైంది. ‘వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా హిందీకి మంచి గుర్తింపు తీసుకొస్తాం’ అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గతంలోనే చెప్పారు. ప్రాంతీయ పార్టీలు, సినీ నటులు తప్పు పట్టినా ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగమైన ‘ఒకే దేశం-ఒకే భాష’ అమలుకు అంటే ఉత్తరాది, దక్షిణాది మధ్య విభేదాలు పెంచడానికి బీజేపీ ఆజ్యం పోస్తున్నది. మన దేశంలో 122 భాషలు, 19,500 రకాల మాండలికాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనన్ని సామాజిక వర్గాలు, మతాలు, భాషలు, సంస్కృతులకు భారతదేశం నిలయం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తోపాటు సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయ కోవిదులు తదనుగుణమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశంలోని విభిన్న భాషలు, సంస్కృతులను, భాషా వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 భాషలకు అధికార భాషలుగా గుర్తింపు ఇచ్చారు. 29వ అధికరణం ప్రకారం పౌరులు తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతి సంప్రదాయాలు పాటించేందుకు స్వేచ్ఛ కలిగి ఉంటారు.
హిందీ పట్ల బీజేపీ చూపిస్తున్న వల్లమాలిన ప్రేమ వెనుక ఉత్తరాది, దక్షిణాది మధ్య భాషోద్యమ చిచ్చు రగల్చాలనే పథకం ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆ మంటల్లో చలి కాచుకోవాలని ఆ పార్టీ చూస్తున్నది. హిందీని బలవంతంగా రుద్ది దేశంలో అత్యధికులు మాట్లాడే ప్రాంతీయ భాషలను నెమ్మదిగా చంపేస్తారా అన్న చర్చ జరుగుతున్నది.
దేశంలో చాలా మంది ప్రజలు తమ ప్రాంతీయ భాషలో మాట్లాడతారు. దక్షిణ భారత దేశంలో ఈ పరిస్థితి అధికం. వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా పరిపాలనలోనూ వినియోగిస్తున్నాయి. నిజానికి ఇండియాకు ప్రత్యేకంగా జాతీయ భాషంటూ ఇంతవరకూ ఏదీ లేదు. భారత రాజ్యాంగంలోని గుర్తింపు పొందిన 22 భాషల్లో హిందీ భాష కూడా ఒకటి. 1950లో తెలుగు, తమిళం, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కశ్మీరి, మలయాళం, మరాఠీ, ఒరియా, హిందీ తదితర 14 భాషలను కలిపి ఒక జాబితాను రూపొందించారు. దేవనాగరి లిపిలోని హిందీని, ఇంగ్లీష్ను దేశ అధికారిక భాషలుగా, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో వాడే భాషగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) పేర్కొంది. అంటే హిందీ అధికారిక భాష మాత్రమే. దేశంలో అత్యధిక ప్రజలకు తెలిసిన భాష కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసం హిందీకి ఆ హోదా ఇచ్చారు. చాలా మందికి తెలిసిన భాష కాబట్టి ఇంగ్లీషును అధికారిక భాషగా వినియోగించవచ్చని చెప్పారు. అయితే హిందీ రానివారు అసమర్థులని, మాట్లాడనివారు ముూర్ఖులతో సమానమన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తుండడం ఆక్షేపణీయమే. కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలను సమానంగా గౌరవించి, ఆదరించాలి. అంతేకానీ ఒక భాషకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం, మిగతా భాషలపై నిర్లక్ష్యం వహించడం తగని పని.
హిందీ పట్ల బీజేపీ చూపిస్తున్న వల్లమాలిన ప్రేమ వెనుక ఉత్తరాది, దక్షిణాది మధ్య భాషోద్యమ చిచ్చు రగల్చాలనే పథకం ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆ మంటల్లో చలి కాచుకోవాలని ఆ పార్టీ చూస్తున్నది. హిందీని బలవంతంగా రుద్ది దేశంలో అత్యధికులు మాట్లాడే ప్రాంతీయ భాషలను నెమ్మదిగా చంపేస్తారా అన్న చర్చ జరుగుతున్నది. తియ్యని తేట తెలుగును బంధిస్తారా? ప్రపంచ భజన సంప్రదాయాన్ని జనం మార్గం పట్టించిన మరాఠీ అభంగాల సౌందర్యం ఎవరూ చూడకూడదా? వేదాలతో సమానంగా నిలిచే తమిళ నయనార్ల, అళ్వారుల పత్తికాలు ఎవరూ వినలేరా? భారతీయ సాహిత్యానికి మణి దీపాల వెలుగులు పంచిన మలయాళ మలయ మారుతాల పులకింతలు వద్దా? మరాఠీ భజనల కొనసాగింపుగా కన్నడతో జన సామాన్యుల చేరిన దాస సాహిత్య ఇక్షు సాగరంలో మునకలు వేయొ ద్దా? అయోధ్య రాముడే మురిసిన రామదాసు త్యాగయ్య తెలుగు కీర్తనలు వినవద్దా? పోతన పూత పూసిన కృష్ణ తత్వం, బెంగాలీ సాహి త్యం, సీతమ్మ పుట్టింటి మైథిలి భాష ఏమై పోవాలని భాషా పండితులు కలత చెందే పరిస్థితి
నెలకొంటున్నది.
-వెంకట్ గుంటిపల్లి, 94949 41001