ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో పదేండ్ల ముందు పురుడు పోసుకున్నదే అయి ఉండవచ్చు, ఈ దేశంలో ఒక భాగం మాత్రమే. ప్రత్యేక దేశం కాదు. కేసీఆర్ ప్రస్తుతం ప్రధాన మంత్రి కాకపోవచ్చు, కానీ ఆయన అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పథకాలపై అగ్రరాజ్యంలోని సమాజంలో చర్చ జరుగుతున్నది. విశాలంగా యోచించనివారికి ఈ మాటలు విడ్డూరంగా గోచరించవచ్చు. అయితే అంశాలవారీగా నిశితంగా పరిశీలించినపుడే అనితర సాధ్యమైన అద్భుతాలు కండ్లముందు సాక్షీభూతంగా కనిపిస్తాయి. ఈ నెల 2 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించి వచ్చిన నాకు అలాంటి అనుభవాలు విస్మయాన్ని కలిగించాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికాలో 60 ఏండ్లు పైబడిన వారికి 2 వేల డాలర్ల వరకు ఆహార వస్తువులకు సంబంధించిన కూపన్ల జారీ, ఆరోగ్య బీమా లాంటి చిన్నాచితక పథకాలు తప్ప మరేమీ అమల్లో లేవు. అగ్రరాజ్యంగా కొనసాగుతున్నప్పటికీ స్పష్టమైన ఆర్థిక, సంక్షేమ ప్రణాళికలు రూపొందిస్తున్న దాఖలాల్లేవు. సాధికారికంగా ఎలాంటి విధానాలు, విధాన నిర్ణయాలు లభ్యం కావడం లేదు. మన దేశంలో మనం దారిద్య్రరేఖ దిగువ అనే పదం వాడతాం, అక్కడ హోంలెస్ అంటారు. ఇక్కడ కులా లు, అంతరాలు, వివక్ష కనిపిస్తాయి, అక్కడ తెల్ల, నల్ల వర్ణాల జాతీయుల మధ్య విభేదాలు, వివక్ష గోచరిస్తాయి. నేడు అక్కడ ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణంతో నిరుద్యోగ సమస్య పెచ్చు పెరిగిపోతున్నది. పేదరికం తాండవించడం కారణంగా ఆయా సందర్భాల్లో వెర్రి తలలు వేస్తున్న యువత ‘గన్కల్చర్’ మితి మీరి అమాయకులను బలి తీసుకుంటున్న ఉదంతాలు షరామామూలు కావడం గమనించదగింది. ఇక్కడి పోలీసుశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు అనతికాలంలోనే ఫలితాలనివ్వడం గమనించవచ్చును. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ ప్రపంచందృష్టిని ఆకర్షించింది. ‘షీ’ టీమ్స్ ఏర్పాటుతో తగ్గిన నేరాల సంఖ్య దేశానికి ఆదర్శంగానే నిలుస్తున్నది.
అమెరికాలోని మహా నగరాల్లో రోడ్డుపై ‘ఆహారం పెట్టించండి’ అని దీనంగా అడుక్కునే విద్యావంతుల సంఖ్య మిక్కిలిగానే కనిపించడం విషాదం కలిగించింది. ‘ఫిలడెల్ఫియా’లో తానా మహాసభల సందర్భంలో ఒక మిత్రుడి కుటుంబసభ్యులతో కార్యక్రమాలలో పాల్గొని, మేం బసచేసిన మారియట్ హోటల్కు చేరుకున్నాక, అవసరమైన బ్యాగేజీ తెచ్చుకునేందుకు సెల్లార్లో పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లాం. అప్పటికే ఎవరో కారు అద్దాలు ధ్వంసం చేశారు. లోపల వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. ఖరీదైనవి ఏమైనా ఎత్తుకుపోయారేమోనని ఆందోళన చెందిన కుటుంబసభ్యులకు ఒకింత విస్మయాన్ని కలిగించిన ఘటన ఏమంటే కేవలం వారు తెచ్చుకున్న తిను బండారాలు మాత్రమే చోరీకి గురికావడం. డైమండ్ నెక్లెస్లు, డాలర్ల పర్సులు ఇత్యాదివి అతిభద్రంగా ఉన్నాయి. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తే తినుబండారాలు మాత్రమే ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఒక్క సంఘటన చాలదా అగ్రరాజ్యంలో తాండవిస్తున్న ఆకలి ఘోషలు తెలుసుకునేందుకు. ఇక్కడి విషయానికి వస్తే గతంలోని దుర్ఘటనలు, విషాదాలు తెలిసినవే, అనుభవంలో ఉన్నవే. అయితే తులనాత్మకంగా చూసినప్పుడు నేటి తెలంగాణ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. జీవన భరోసాను, భద్రతను కల్పిస్తున్నాయి. జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. అంతరాలను తగ్గించేస్తున్నాయి. వెరసి రాష్ట్ర ఆర్థిక పురోగతికి దారితీస్తున్నాయి. దేశంలోనే అతి క్రమశిక్షణ కలిగిన పురోగామి రాష్ట్రంగా, శరవేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని సాధికారికంగా చెప్పుకోగలగడం అభినందించదగింది.
అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని తెలుగువారి ఆహ్వానాల మేరకు ఫిలడెల్ఫియా, హౌస్టన్, షుగర్లాండ్, డల్లాస్, న్యూయార్క్, న్యూజెర్సీ, బఫెల్లో, ఛార్లెట్, రాలీ నగరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభల్లో అతిథిగా పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఆ నగరాల్లో పర్యటిస్తున్నప్పుడు, కొన్ని దర్శనీయ ప్రదేశాలను నిర్వాహకులు చూపించారు. నా దృష్టంతా ప్రదేశాల మీద కంటే కూడా ప్రజల జీవన ప్రమాణాలపైనే ఉన్నది. నగరాల్లో ఉన్న సౌకర్యాలు ఇత్యాదివాటి పరిశీలనలపై కేంద్రీకరించాను. న్యూయార్క్లో ఇరుకురోడ్లు. యాక్సిడెంట్ జరిగితే రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి, ట్రాఫిక్ స్తంభించడం అక్కడ పరిపాటి. ఇలాంటి ఘటనలు దేశమంతా ఉంటాయని అక్కడివారు తెలిపారు. ఒక నిర్మాణం కూల్చి, మరో నిర్మాణం చేపట్టాలంటే, ప్రత్యేక అనుమతులు, దారుల మళ్లింపులు అమలుచేయాల్సిందే. అలా ప్రజల కష్టాలు చెప్పనలవి కాదు. ఇలా ఒక్కొక్క ప్రధాన నగరంలో ఒక్కో రీతిలో ప్రజల ఇబ్బందులు స్పష్టంగానే కనిపించాయి.
నా పర్యటనల్లో చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటిగా హైదరాబాద్ను అమెరికాలోని ప్రధాన నగరాలతో పోల్చుతూ ప్రశంసలు కురిపించడం సంతోషాన్ని కలిగించిన సన్నివేశం. ఇప్పుడు అమెరికావాసులు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. ఇదొక ప్రపంచస్థాయి గుర్తింపునకు, ప్రబల ప్రగతికి తార్కాణం.
మన రాష్ట్రంలో గమనిస్తే పదేండ్లలోపే కఠినమైన నిర్ణయాలు, అత్యంత ప్రామాణిక ప్రణాళికలతో, పారదర్శకంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమల్లోకి తెచ్చి పకడ్బందీగా అందించడం వల్లనే ప్రపంచ చిత్రపటంలో నేడు తెలంగాణ ఒక ప్రత్యేక దేశం అన్నంత స్థాయిలో గుర్తింపును పొందగల్గుతున్నది. ‘కాళేశ్వరం’ లాంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, యాదాద్రి లాంటి పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణం, రెసిడెన్షియల్ పాఠశాలలు, కల్యాణలక్ష్మి, విదేశీ విద్యానిధి పారితోషకం, కేసీఆర్ కిట్, బోధనా రుసుం పథకం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలపై ఆయా సభల్లో అక్కడ పేరెన్నిక గన్న పెద్ద మనుషులు చర్చకు తీసి ప్రశంసిస్తున్నప్పుడు, ఈ పర్యటనల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా నా హృదయం నిండైన ఆనందంతో పొంగిపోయింది.
మహోన్నత శిఖర సమానుడు, సామాజిక, రాజకీయ శాస్త్రవేత్త, సమసమాజ దార్శనికుడైన కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే భాగ్యం కలుగడం అనిర్వచనీయమైన, అరుదైన ఘటన. అమెరికాలో పర్యటించి వచ్చాక నేను మరింత అదృష్టవంతుడిని అనిపించింది. కేసీఆర్ను వీలైనప్పుడల్లా కలిసి, వారితో మాట్లాడే కొద్దిమంది వ్యక్తుల్లో నేను కూడా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ విషయంలో నా జన్మ చరితార్థమైనదనే భావన గొప్ప అనుభూతినిస్తుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)
-డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు
98499 12948