ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణను మరోసారి ఆగం చేయడానికి, ప్రజలను మరోసారి తప్పుదారి పట్టించడానికి సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పాలకులు సిద్ధమయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అవగాహనారాహిత్యంతో అసెంబ్లీలో మాట్లాడుతున్నారని తెలంగాణ సాగునీటి రంగంపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా సులభంగానే అర్థమవుతుంది.
శాసనసభలో సాగునీటి రంగంపై తన అవగాహనారాహిత్యాన్ని సమర్థించుకోవడానికి, ప్రజలను మరింత గందరగోళ పర్చడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడిన ఒక క్లిప్ (తనకు అవసరమైన ముక్కలు)లోని చిన్న భాగాన్ని శాసనసభ్యులకు మంత్రి ఉత్తమ్ చూపించారు. ఆయన వ్యాఖ్యల్లోని అసత్యాలు, అబద్ధాలు ఈ విధంగా ఉన్నాయి.
సమైక్య రాష్ట్రంలో కన్నా ఎక్కువ అన్యాయం బీఆర్ఎస్ పాలనలో జరిగిందని పదేపదే ఉత్తమ్ పేర్కొంటున్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు మరోసారి ఈ తరానికి తెలపాల్సి ఉంది. ఆంధ్రా – తెలంగాణ (అప్పటి హైదరాబాద్) రాష్ట్రంలో ‘విశాలాంధ్ర’ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది అప్పటి కాంగ్రెస్ నాయకులే. ఈ సమైక్య నినాదం ‘తెలుగు భాష’ ముసుగులో సాగిన అసలు కారణాల్లో మొదటిది కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణకు దక్కనివ్వకుండా ఆంధ్రకు మళ్లించాలనేది సుస్పష్టం. చరిత్రే దీనికి సాక్ష్యం.
ఆనాడు ఏడో నిజాం వద్ద ఉండే ప్రముఖ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ సహకారంతో తెలంగాణలో కరువు బారినపడుతున్న నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కేవలం నాలుగు ప్రాజెక్టుల ద్వారా (ఎగువ కృష్ణా 54 టీఎంసీలు, భీమా 100.50 టీఎంసీలు, తుంగభద్రా లో లెవెల్ కెనాల్ 19.50 టీఎంసీలు, ఏలేశ్వరం ప్రాజెక్ట్ 161 టీఎంసీలు) మొత్తం 335 టీఎంసీలను వినియోగించాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. పైన పేర్కొన్న ప్రాజెక్టులకు 1951 జూలై 27, 28 తేదీల్లో కేంద్ర ప్రణాళికా సంఘం కృష్ణా జలాలను కూడా కేటాయించింది.
ఈ ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణలోని కృష్ణా బేసిన్లో 335 టీఎంసీల నీళ్లు పారితే (తెలంగాణలోని కృష్ణా బేసిన్లో ఉన్న మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు కాకుండానే) కోస్తాంధ్ర, రాయలసీమలోని కృష్ణా బేసిన్కు వెలుపలి ప్రాంతాలకు నీళ్లు దక్కవనే కారణంగానే అప్పటి కాంగ్రెస్ పాలకులు తెలంగాణను ఆంధ్రతో కలపాలని విశాలాంధ్ర నినాదం, ఉద్యమాన్ని తీసుకొచ్చారు. రాష్ర్టాల పునర్విభజన కమిషన్ ముందు తెలంగాణవాదులు ఇదే భయాన్ని, సందేహాలను, అనుమానాలను స్పష్టంగానే తెలిపారని జస్టిస్ ఫజల్ అలీ తన రిపోర్టులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఆనాటి తెలంగాణవాదుల భయాలే నిజమయ్యాయి. రాయలసీమవాసి, అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి కాగానే పాలమూరుకు నీళ్లు ఇచ్చేందుకు ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టులను (174 టీఎంసీలు) గాలికొదిలేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభం దాకా సుమారు మూడున్నర దశాబ్దాలకు పైగా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు వదిలేశారో కనీసం ప్రశ్నించిన పాపానపోలేదు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఈ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పాలకులదే.
నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సుమారు 7 లక్షల ఎకరాలకుపైగా సాగునీరందాల్సిన ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని దిగువన గల నందికొండ వద్దకు మార్చింది కాంగ్రెస్ పాలకులే. దీనివల్ల 161 టీఎంసీలకు బదులు కనీసం 70-80 టీఎంసీలు కూడా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఐదారేండ్లకోసారి పారడం లేదు. ఈ కుట్రల వల్ల పాలమూరు- నల్లగొండ జిల్లాలకు చెందిన సుమారు 19-20 లక్షల మంది నాలుగు దశాబ్దాలకు పైగా వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పాపానికి కారణం కూడా కాంగ్రెస్ పాలకులే.
‘మా నీళ్లు మాకు కావాలి’ అని ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ సమైక్య రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి వివక్షకు వ్యతిరేకంగా 40 రోజులకు పైగా జలసాధన ఉద్యమాన్ని నిర్వహించారు. ఇరవై ఏండ్ల కిందటే తెలంగాణ సాగునీటి కష్టాలు తొలగించడానికి ఒక అద్భుతమైన విజన్ను రూపొందించారు. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి జలయజ్ఞం పేరుతో మరోసారి తెలంగాణకు నష్టం చేయడానికి, ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. నీళ్లు రావని తెలిసి ఎస్సారెస్పీ రెండో దశ కాల్వలు తవ్వారు. ప్రాజెక్టు నిర్మించడం సాధ్యపడదని తెలిసి, తుమ్మిడిహట్టి వద్ద పర్యావరణ అనుమతులు రావని తెలిసి, అంతర్రాష్ట్ర సమస్యలున్నాయని తెలిసి కూడా చేవెళ్ల వద్ద కాల్వలు తవ్వారు. కేంద్ర జలసంఘం అనుమతులు లేకుండానే పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు ఐదు టీఎంసీల నీటిని మళ్లించారు.
శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్తు కోసమే తప్ప సాగునీటికి కాదని, బచావత్ తీర్పును కాలరాసి చుక్క నీరు కూడా నాగార్జునసాగర్కు రానివ్వకుండా రాయలసీమకు మళ్లించుకుపోవాలని కుట్రలు చేసింది ఈ కాంగ్రెస్ నాయకులు కాదా? కేసీఆర్ పాలనలోనే పాలమూరు పచ్చబడ్డది. ఏనాడూ లక్ష ఎకరాలు పారని జిల్లాలో 11 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలను ఇచ్చింది నిజం కాదా? సమైక్య రాష్ట్రంలో కన్నా గత పదేండ్ల కేసీఆర్ పాలనలోనే సాగునీటి రంగంలో తెలంగాణ ఎక్కువగా నష్టపోయిందని అనడానికి నోరెలా వచ్చింది మంత్రి గారు.
అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్రెడ్డి వాస్తవాన్ని వక్రీకరించిన మరొక అర్ధ సత్యం వైఎస్ జగన్ వీడియో క్లిప్. ఈ క్లిప్ను అసందర్భంగా ముక్కలు చేసి చూపించిన విషయం చూసినవారికి అర్థమవుతూనే ఉన్నది. వేరుపడిన అవశేష ఆంధ్రప్రదేశ్ సాగునీటి కష్టాలు తీరాలంటే కృష్ణాజలాలను మళ్లించుకుపోవడం వల్ల సాధ్యపడదని ‘తెలంగాణ భూభాగం గుండా గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించాలి’ అని కేసీఆర్ నాలుగేండ్ల కిందట ఏపీ సీఎం జగన్కు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. 2019 జూన్- నవంబర్ మధ్యకాలంలో మూడుసార్లు ప్రగతి భవన్లో వారిద్దరి మధ్య ఇరుప్రాంతాల ఇంజినీర్ల సమక్షంలో సమావేశాలు జరిగి ఐదు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిని ప్రస్తావిస్తూ జగన్ ఏపీ శాసనసభలో ‘తెలంగాణ భూభాగం గుండా నీళ్లను ఆంధ్రప్రదేశ్కు ఇవ్వడానికి సిద్ధపడ్డారు’ అని ఆ వీడియో క్లిప్లో ప్రస్తావించారు. ఇది నిజమని నమ్మడానికి ఆధారం రాయలసీమ ఎత్తిపోతల పథకం మళ్లించే నీళ్లు తెలంగాణ భూభాగం గుండా కాదు, ఆ నీళ్లు రాయలసీమలోని కర్నూలు జిల్లా భూముల నుంచే పోతాయనేది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను ఆపకుండా ఉండడానికే కేసీఆర్ అపెక్స్ కమిటీ మీటింగ్కు పోలేదనేది మరో అబద్ధం. ఒకవేళ ఈ పథకానికి కేసీఆర్ మద్దతివ్వాలనుకుంటే జూలై 31న (అపెక్స్ కమిటీ మీటింగ్కు వారం ముందే) కేఆర్ఎంబీ ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులు వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ అయ్యేవేకావు. ఈ ప్రాజెక్టును ఆపాలని, స్టే ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆగస్టు 5న పిటిషన్ను వేసేదేకాదు.
శ్రీనివాస్ అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ను దాఖలు చేసినా ఆ కేసులో బలమైన వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కాదా? ఇప్పటిదాకా అడుగడుగునా కేఆర్ఎంబీ, ఎన్జీటీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని ఒత్తిడి తెచ్చింది బీఆర్ఎస్ కాదా?
రోజుకు ఎనిమిది టీఎంసీల నీళ్లను ఆంధ్రకు తరలిస్తుంటే కేసీఆర్ ఆపలేకపోయారనేది మరో అబద్ధం. ఇప్పటివరకు ఆ పథకం ప్రారంభ దశలోనే ఉంటే ఎక్కడి నుంచి.. ఎలా.. రోజుకు ఎనిమిది టీఎంసీలు తరలించుకుపోయారో ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పాలి? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపకపోతే దానికి ఎగువన కృష్ణా నదిపై ఆనకట్ట కట్టి చుక్కనీటిని కూడా పోనివ్వనని జగన్కు కేసీఆర్ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసి కూడా కేసీఆర్పై అభాండాలు వేయడం విజ్ఞత అనిపించుకోదు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మరో ఆరోపణ ఏమిటంటే.. 68 శాతం కృష్ణా పరీవాహక ప్రాంతం ఉన్న తెలంగాణ రాష్ర్టానికి 299 టీఎంసీలకు అంగీకరించడం లేదా 50:50 నిష్పత్తిని అడగటం ఆంధ్రకు కృష్ణా నీళ్లను దోచిపెట్టడానికేనని. జల విధానాలు, ట్రిబ్యునల్ తీర్పులు అవగాహన చేసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు మంత్రి చేసి ఉండేవారు కాదేమో!
కృష్ణా జల వివాదాల పరిష్కారం కోసం 2004లో ఏర్పడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్ర-తెలంగాణ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ చేసేదాకా.. గతంలో బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టులవారీగా లేదా సమైక్యరాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి విభజనకు ముందు పంపిణీ చేసిన విధానమే కొనసాగుతుంది. కేసీఆర్ ప్రభుత్వమైనా రేవంత్రెడ్డి సర్కార్ అయినా 299:512 టీఎంసీల నిష్పత్తిని అంగీకరించాల్సి ఉంటుంది. 2015లో ఒక్క సంవత్సరం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేసినా, అదే విధానాన్ని కొనసాగిస్తుండటంతో తెలంగాణ నీటిపారుదల ముఖ్యకార్యదర్శి ఏటా అడ్డుకుని, అరిచినా, నిరసన తెలిపి వాకౌట్ చేసినా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలేదాకా అంగీకరించక తప్పదు. ఏ కోర్టుకు పోయినా మన కోర్కెలు మన్నించరు. అసెంబ్లీలో ఈ విషయమై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న ఉత్తమ్-రేవంత్లు కూడా రాబోయే కాలంలో 299:512 టీఎంసీలకు ఒప్పుకోక తప్పదు.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించే దాకా మార్చే అవకాశం లేదు. రాష్ర్టాన్ని విభజించిన కాంగ్రెస్కే ఏపీ విభజన చట్టంలో నీళ్లను పంచే అవకాశం ఉండింది. దాన్ని అప్పటి కాంగ్రెస్ ఉపయోగించుకోలేదు. బచావత్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ గొంతును వినిపించకుండా కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న పరిమిత జలాలను కోస్తాంధ్ర – రాయలసీమకు తరలించుకుపోయింది, తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పాలకులే.
వరద జలాలు వినియోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి బచావత్ ఇవ్వడాన్ని సాకుగా తీసుకొని మద్రాసుకు మంచినీరందించే పేరుతో బచావత్ తీర్పును కాలరాస్తూ.. శ్రీశైలం ప్రాజెక్టును సాగు నీటి ప్రాజెక్టుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. శ్రీశైలం ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా అడ్డదారిలో మార్చినందుకు నీలం సంజీవరెడ్డి పేరు ఆ ప్రాజెక్టుకు పెట్టారు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జునసాగర్లను అప్పగించింది బీఆర్ఎస్ పాలకులేనని నమ్మించడానికి విఫలయత్నం చేశారు. ఈ అబద్ధాన్ని ప్రతిపక్ష నాయకుడు హరీశ్రావు బట్టబయలు చేశారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ -2 ప్రభుత్వం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారానే. చట్టబద్ధంగా ఏర్పాటైన కేఆర్ఎంబీని గుర్తించలేమనో, ప్రాజెక్టులను అప్పగించలేమనో చెప్పడం అవివేకమవుతుంది. ప్రాజెక్టులను అప్పగించడంలో ఉన్న సమస్యలను కేఆర్ఎంబీ లేదా అపెక్స్ కమిటీ ద్వారా కేంద్ర జల శక్తి మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పడానికే అవసరమైన ప్రొటోకాల్స్, కృష్ణా జలాల్లో వాటా తదితర అంశాలను షరతులుగా పేర్కొంటూ గత తొమ్మిదేండ్లు ప్రాజెక్టులను తన చేతుల్లోనే ఉంచుకున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇక ముందు ఇదే పద్ధతి కొనసాగాలి. ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణలోని 9 ఔట్లెట్లను కేంద్రానికి అప్పగించడం పెద్ద తప్పు.
హరీశ్రావు విమర్శతో జరిగిన తప్పును తెలుసుకొని ప్రాజెక్టులను అప్పగించేది లేదని తీర్మానం చేసి ఈ ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఇది మాత్రమే చాలదు. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తెచ్చి కృష్ణా జలాల పునఃపంపిణీ సమస్యను సత్వరమే పరిష్కరించేలా ట్రిబ్యునల్పై ఒత్తిడి పెంచాలి. వెంటనే అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయాలి.
ప్రధాన ప్రతిపక్ష నాయకుని పట్ల ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరి, ఉపయోగిస్తున్న భాష, వ్యవహార శైలి తెలంగాణ ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారింది. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ అనతికాలంలోనే తలెత్తుకోలేని విధంగా మారడం విషాదకరం!
వ్యాసకర్త: మాజీ చైర్మన్,తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ
-వి.ప్రకాశ్