మన దేశంలోని రెండు రాష్ర్టాల్లో ఇటీవల నాటకీయ పరిణామాలు సంభవించాయి. బీహార్లో కూటమి తారుమారైంది. కానీ, సీఎం మారలేదు. ఝార్ఖండ్లో సీఎంలు మారిపోయారు. కానీ, పాతకూటమే కొనసాగుతున్నది. ఈడీ అరెస్టు చేయడంతో ఝార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరేన్ రాజీనామా చేయడంతో ఆయన వారసునిగా చంపయీ సొరేన్ ఎన్నికయ్యారు. ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలవడానికి గవర్నర్ రాధాకృష్ణన్ 18 గంటల సమయం తీసుకోవడం వివాదాస్పదమైంది.ఎట్టకేలకు గవర్నర్ పిలుపు రావడంతో అసెంబ్లీలో చంపయీ సోరేన్ తన మెజారిటీ నిరూపించుకోవడంతో కథ సుఖాంతమైంది. అదే బీహార్లో సీఎం నితీశ్ రాజీనామా చేసిన మూడు గంటల్లోనే గవర్నర్ పిలుపు దక్కింది. ఆయన ప్రమాణం చేసి మళ్లీ పదవిని చేపట్టారు.
‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పరవాలేదు’ అనే సామెత ఇక్కడ గుర్తుకురాక మానదు. ఈ తేడా వెనుకనున్న రాజకీయాన్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎమ్మెల్యేల బేరసారాలకు ఈ కాలహరణం వెసులుబాటు కల్పిస్తుందనేది తెలిసిందే. 2న పదవీ ప్రమాణం స్వీకరించిన చంపయీ బలపరీక్షకు గవర్నర్ పదిరోజుల గడువు ఇచ్చారు. అంతవరకు తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఝార్ఖండ్ పాలక కూటమి క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. అటు బీహార్, ఇటు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ రిసార్టులే క్యాంపులు కావడం గమనార్హం.
హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లడంతో జేఎంఎం పరిస్థితి డోలాయమానంలో పడింది. కొత్త సీఎం చంపయీ సొరేన్ తన సంఖ్యాబలాన్ని కాపాడుకోవడం అంత సులభమేమీ కాదు. ప్రస్తుతం కొనసాగుతున్న క్యాంపు రాజకీయాలు అందుకు అద్దం పడుతున్నాయి. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడున్నంత అభద్రతతో బహుశా ఎప్పుడూ లేవేమో. నిజానికి విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే సంప్రదాయం కాంగ్రెస్ హయాంలోనే మొగ్గతొడిగింది. కేరళలోని నంబూద్రిపాద్ ప్రభుత్వ బర్తరఫ్తో మొదలైన ఈ ఆనవాయితీ ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడం వరకు అప్రతిహతంగా కొనసాగింది. కాంగ్రెస్ కన్నా రెండాకులు ఎక్కువే చదివిన బీజేపీ హయాంలో ఈ ధోరణి పరాకాష్ఠకు చేరింది. అవకాశాల కోసం ఎదురుచూడటం కాకుండా వాటిని తానే సృష్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నది బీజేపీ. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని విపక్షాలు పదేపదే విమర్శిస్తుండటం తెలిసిందే.
‘గెలిస్తే పరిపాలిస్తా.. ఓడిపోతే పక్కకు పోతా’ అనేది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా గోడమీద రాసుకోవాల్సిన సూక్తి. ఈ షరతుకు ఒప్పుకొంటేనే ఓటు రాజకీయం అనేది సవ్యంగా సాగుతుంది. మనదేశంలోని రాజకీయ పార్టీలన్నీ కొంచెం అటూఇటూగా ఈ షరతుకు లోబడే ఆటలోకి దిగుతాయి. కానీ, ప్రస్తుతం కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న బీజేపీ తీరువేరు. ఎక్కడైనా తానే గెలవాలనే మొండితనం ఆ పార్టీలో దండిగా ఉంది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు సామ, దాన, భేద, దండోపాయాల్ని ఆ పార్టీ ఉపయోగిస్తుందనేది బహిరంగ రహస్యమే. ఝార్ఖండ్ పరిణామాలు చివరకు ఏ మలుపు తిరుగుతాయో తెలియడం లేదు.
మొన్న కర్ణాటకలో, నిన్న మహారాష్ట్రలో పార్టీలను చీల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈశాన్యంలోనూ ఇదే ఎత్తుగడలను ఉపయోగించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. ఝార్ఖండ్లో ఆ తరహా అవకాశం కోసం బీజేపీ ఎదురు చూస్తున్నది. మొత్తం మీద ఒకటి మాత్రం నిజం. ఇటువంటి అధికార క్రీడ వల్ల ప్రజల తీర్పు పదేపదే వంచనకు గురవుతుంది. ప్రజాప్రభుత్వం అనేది అర్థంలేని మాట అవుతుంది. ఈ తరహా రాజకీయాల వల్ల అంతిమంగా సమాఖ్యవాదానికి ముప్పు ఏర్పడుతుంది.