గత ఆరేండ్లలో బడి మాత్రమే కాదు మా బతుకులూ మారాయి. రాష్ట్ర ప్రభుత్వం మా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ‘అల్పాహారం’ పథకం పై కొంతమంది విమర్శలు చూశాక నేను ఈ పోస్ట్ పెట్టాలనుకున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏ పథకమైనా మీ విమర్శకు ఆస్కారం ఉంటుందేమో కానీ, ఓట్లే లేని మా పిల్లల కోసం తెచ్చిన ఈ పథకం మాకు చాలా అవసరం. నిజంగా దీనివల్ల ఎదురయ్యే కష్టం ఏదైనా ఉంటే అది మా ఉపాధ్యాయులకు మాత్రమే. అయినా భరిస్తం. ఎందుకంటే…?
రాత్రి తినో, తినకో అర్ధాకలితో పడుకొని, మధ్యా హ్నం తినే మధ్యాహ్న భోజనం కోసం ఎదురుచూ స్తూ, పరగడుపునే బడికొచ్చి కండ్లు తిరిగి కింద పడిపో యే పిల్లలు మా స్కూళ్లో సగం మందికిపైగా ఉంటారు. వాళ్లను అలా చూస్తూ మేం చదువెలా చెప్పగలం. మా పిల్లలు వచ్చేదే చాలా బీద గుడిసెల నుంచి. ముఖ్యంగా సిటీలోనైతే మురికివాడల పిల్లలే ఎక్కువ మంది. వారి తల్లిదండ్రుల బతుకు పోరాటానికే సమయం ఉండదు. అలాంటి వారు వారి పనిఒత్తిడిలో పిల్లలను ఎలా పట్టించుకుంటారో ఊహించుకోవచ్చు.
కాస్త తెలివైన తల్లిదండ్రులు, డబ్బులున్న పేరెంట్స్ వారి పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్కో, లేక ఏ ప్రైవేటు పాఠశాలకో పంపిస్తారు. మాకు వచ్చే తొంభై శాతం పిల్లలకు మేము చదువు చెప్పడం కన్నా వారిని రోజు బడికి రప్పించటమే కష్టమౌతుంది. అలాంటి పిల్ల లకోసం మేం చేయాల్సిన అదనపు పను లు చాలా ఉంటాయి. అందులో మాకిప్పుడు ముఖ్యమైనదే ఈ అల్పాహారం పని. మా భవిష్యత్తు కోసం, పిల్లల ఆరోగ్యం కోసం మేం ఈ పని చేయడానికి సిద్ధం. ఎందుకంటే పెద్ద మనసుతో చాలామంది టీచర్లు పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చిచ్చే సందర్భాలు కోకొల్లలు. కాబట్టి మాకు తెలుసు ఇది ఎంత గొప్ప పథకమో.
పిల్లలు వాష్రూమ్కు వెళ్లాలంటే రోడ్డు పక్కన నాలాలు, టీచర్లు వెళ్లాలంటే బడి దగ్గరలో తెలిసిన వాళ్ల్ల ఇల్లు వెతుక్కునే రోజుల నుంచి సుందరమైన బాత్రూంలతో, అందమైన క్లాస్ రూంలతో ఉచిత పుస్తకాలు, యూనిఫాంలతో పాటు ఉచిత భోజనం దశ దాటిన తర్వాత మాకు అత్యవసరమైనది ఈ ‘అల్పాహారం’ పథకమే. కాబట్టి దయచేసి మా పిల్లల నోటికాడి బుక్కను ఎత్తగొట్టకండి.
మేం అడుగక ముందే మా స్థితిని గమనించి మా కోసం తెచ్చిన ఒక బృహత్తర కార్యక్రమం ఇది. దీన్ని కొనసాగించాలంటే ప్రభుత్వానికి కష్టమైన పనే, అయినప్పటికీ బాలారిష్టాలు అన్నీ అధిగమించి ఒక విఫల పథకంగా మారకుండా ఉండాలంటే సమాజం ఆమోదం కూడా అవసరం. అందుకే మాకు సహకరించాలని ఈ వేడుకోలు.
(ఉపాధ్యాయుడు శ్రావణ్ కుమార్ తన ఫేస్బుక్ వాల్ మీద రాసుకున్న పోస్ట్ యథాతథంగా…)