ప్రకృతి ప్రసాదించిన సృష్టిలో అణువణువునా నిండిన సౌందర్యమంతా ఒక ఎత్తైతే, మనిషి తన కళాత్మక దృష్టితో సృష్టించే సౌందర్యాత్మక సృజన మరో ఎత్తు. ఏ సమాజంలోనైతే ఈస్తటిక్స్తో కూడిన కళలు, సాహిత్యం వర్ధిల్లుతాయో, ఆ సమాజంలో విలువలూ పరిఢవిల్లుతాయి.
నాటి రాజులైనా, నేటి పాలకులైనా స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాల కోసం నిర్మించిన అనేకానేక కట్టడాలు భవిష్యత్ తరాలకు వారసత్వ, పురావైభవ సంపదగా అలరారుతాయి. సౌందర్యాత్మకతను ప్రకృతికో, కావ్యాలకో సంబంధించిన అంశంగా భావించరాదు. సౌందర్యాత్మకత కట్టడాల్లోనో, కవిత్వంలోనో మాత్రమే కాకుండా మన జీవితంలోని భిన్న సందర్భాల్లోనూ వ్యక్తమవుతుంది. మన మాటలో, పాటలో, పాలనలో, ఆంగికంలో, అనునయంలో వెల్లడవుతుంది.
సౌందర్యాత్మక హృదయం ఉన్న వాళ్లు ఏ రంగంలో ఉన్నా, చేసే ప్రతి పనీ సుందరంగానే కాకుండా హృదయాల సంగమంగా ఉంటుం ది. ఈ సౌందర్యాత్మక దృష్టి పాలకులలో ఉంటే ప్రజల సున్నితమైన అభీష్టాలను గ్రహింపులో ఉంచుకొని వారి కలలు నెరవేరేలా పాలిస్తారు. సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలలో అభిరుచి ఉన్న వాళ్లు అధికారంలో ఉంటే వారి పాలనలో ఈస్తటిక్స్ సహజసిద్ధంగా మిళితమై ఉంటుంది. ప్రజల అనుభవంలోకి కూడా వస్తుంది.
ఈ సౌందర్యాత్మక దృష్టి, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలలో అభిరుచి మెండుగా ఉన్న పాలకుడు కేసీఆర్. అందుకే తెలంగాణ వచ్చిన తరువాత తన పాలనకు కళాత్మకత జోడించి కళలు, కట్టడాలు, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో తనదైన ముద్రను ప్రకటిస్తున్నారు.
కాగితాల మీది కలలకు జీవం పోసి ప్రజల కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, దుర్గం చెరువుపై తీగల వంతెన, సమీకృత కలెక్టరేట్ భవనాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం, నూతన సచివాలయ నిర్మాణం, తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం… ఇవన్నీ ఈ కాలపు సౌందర్యాత్మకతకు ప్రతిబింబాలు. పాలకుని సౌందర్యాత్మక స్పర్శకు నిదర్శనాలు. ఇవన్నీ రేపటికి కళాత్మక, దర్శనీయ స్థలాలుగా ప్రజల మన్ననలందుకుంటాయి. వీటిని కాలం చెక్కిలిపై నిలిచిపోయే అపూర్వ చారిత్రక కట్టడాలుగా గుర్తించాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
-నారదాసు లక్ష్మణ్రావు