‘తెలంగాణ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్ల్లు పెంచాలి’ అన్న విషయంలో రాష్ట్ర శాసనసభ పంపిన తీర్మానాలను గానీ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వినతులనుగానీ, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడివడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన క్రమంలో సామాజిక వర్గాల జనాభా నిష్పత్తిలో మార్పు చోటు చేసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా బలహీనవర్గాల రాష్ట్రం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే 90శాతంగా ఉన్న రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లలో కూడా పెరుగుదల తప్పనిసరిగా అవసరమవుతుందనే స్పృహ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకాలం నుంచీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అవతరించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రిజర్వేషన్ల పెంపుదలపై దృష్టి సారించింది.
సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలైంది. కానీ తెలంగాణ లో 10శాతం దాకా ఎస్టీలున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉన్నది. విద్యా పరంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు (బీసీ-ఈ) 4 శాతమే రిజర్వేషన్ అమలవుతున్నది. కానీ, వారి జనాభా 12 శాతం కన్నా ఎక్కువ ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి చెల్లప్ప కమిషన్ను, ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి సుధీర్ కమిటీని, బీసీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి బీఎస్ రాములు నాయకత్వంలో బీసీ కమిషన్ను నియమించింది. ఆయా కమిషన్లు ఇచ్చిన నివేదికల ప్రకారం ఎస్టీలు, వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
2017 ఏప్రిల్ 16న తెలంగాణ రిజర్వేషన్ బిల్లు-2017ను అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్టీల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి, వెనుకబడిన ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచారు. దీంతో తెలంగాణలో రిజర్వేషన్లు 62 శాతం వరకు పెరిగాయి. పెంచిన రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించడం కోసం 9వ షెడ్యూ ల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ శాసనసభ కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కేంద్రమే ఆయా వర్గాలకు తీరని ద్రోహం తలపెడుతున్నదనడంలో సందేహం లేదు.
ఈ రిజర్వేష్లతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగ నియామకాలు, రాష్ట్ర విద్యాసంస్థల ప్రవేశాల్లో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఒకవైపు తెలంగాణ సామాజిక స్వరూపానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, మరోవైపు కేంద్రం మాత్రం ఈ రిజర్వేషన్లన్నీ కలిపి 50శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పును అడ్డంకిగా చూపుతున్నది. వాస్తవానికి రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదనే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా
లేదన్నది గమనార్హం.
తమిళనాడు రాష్ట్రం తమ రాష్ట్ర సామాజిక స్వరూపానికి అనుగుణంగా 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి 7వ షెడ్యూల్ లో చేర్చింది. తద్వారా పెరిగిన రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతున్నది. కానీ తెలంగాణ విషయానికి వచ్చే సరికి కేంద్రప్రభుత్వం పూర్తిగా ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు ద్రోహం చేస్తున్నది. ఈ ప్రతికూల వైఖరి కారణంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలు, బీసీ-ఈ సామాజిక వర్గ ప్రజలు తమ న్యాయమైన హక్కులను కోల్పోతున్నారు. దీనికి కేంద్రమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది.
ఎస్టీల రిజర్వేషన్ను 10 శాతానికి , బీసీ-ఈ రిజర్వేషన్ను 12 శాతానికి పెంచాలని 2017 ఏప్రిల్ 16న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి, కేంద్రానికి పంపిన బిల్లుకు కేంద్రం వెంటనే రాజ్యాంగ బద్ధత కల్పించి, 9వ షెడ్యూల్ లో చేర్చేలా కేంద్రంలోని బీజేపీ నాయకులు చర్యలు తీసుకోని పక్షంలో వారంతా ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచుతారో, లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ద్రోహులుగా మిగిలిపోతారో కేంద్రంలోని బీజేపీ పెద్దలే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
(వ్యాసకర్త : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
తెలంగాణలో రిజర్వేషన్ల వివరాలు
ఎస్సీ : 15 శాతం
ఎస్టీ: 10 శాతం
(తెలంగాణ ఏర్పాటుకు ముందు 6 శాతం)
బీసీ: 25 శాతం
(బీసీ ఎ-7, బి-10, సి-1, డి-7)
ముస్లిం (బీసీ-ఇ): 12 శాతం
(తెలంగాణ ఏర్పాటుకు ముందు 4 శాతం)
-పీ ఎల్ శ్రీనివాస్
73374 01177