మన తెలంగాణలో వింత నాయకులు మోపయ్యారు. సాధారణ జనం మనోభావాలతో వారికి నిమిత్తం ఉండదు. ప్రజల అంతరంగం వాళ్లకు అంతకన్నా పట్టదు. పౌరుల నాడి జోలికి వారు పోనే పోరు. వాస్తవాలను విస్మరిస్తారు. అభివృద్ధి చూడబుద్ధి కాదు. పైగా తమకు తామే తెలంగాణ ప్రజల తరపున ఉన్నామని స్తుతించుకుంటారు. తెలంగాణను ఉద్ధరిస్తామని ఉద్దెర వాక్కులు దంచుతారు. సిద్ధాంతాలు, విధానాలు, నైతికత, నిబద్ధతలకు తిలోదకాలిస్తారు. పార్టీ ఇదీ అదీ అని కాదు. కేసీఆర్ను ఓడగొట్టేందుకు, రాష్ర్టాన్ని చెడగొట్టే గుంపు కట్టాలె. బస్ అంతే. పైకి వేర్వేరు పార్టీలే అయినా నేతలుగా లోలోపల ఒకటే. ఒక్కటే కలవరింత. పొద్దస్తమానం అదే ఏడుపు.
ఢి ల్లీలోని మోదీ, రాహుల్ మొదలు తెలంగాణలోని నేతాగణం దాకా అందరి కన్నూ బీఆర్ఎస్ మీదే. కేసీఆర్ పైనే. మరొక ధ్యాసే లేదు. ఇంకో మాటే రాదు. పబ్లిక్లో పతార కోసం పాటుపడరు. వాళ్ల పార్టీలకు ఎంతోకొంత ఉన్న పేరుకూ, గుర్తింపునకు వాళ్లంతట వాళ్లే పాతరేసుకుంటారు. వాళ్ల పార్టీలు. వాళ్ల ఇష్టం. కానీ రాజకీయాలంటేనే అసహ్యం కలిగేలా మలినం చేస్తున్నారు. ప్రజాతీర్పుపై గౌరవం, నమ్మకం, విశ్వాసాలను వదిలేస్తున్నారు. ఏ రకంగా చూసినా, ఏ కోణంలో అంచనా కట్టినా, ఏ సగటు నాడి పట్టినా బీఆర్ఎస్, కేసీఆరే జనం మదిలో ఉండడంతో ఆయా పార్టీల్లో నిరాశా నిస్పృహలు ఆవహించాయి. సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోగా, మద్దతు ఈసారి వంద సీట్ల వేగం కండ్లకు కడుతున్నది. దీంతో కేసీఆరే టార్గెట్గా ఒక్కటే బొబ్బ అందుకున్నారు. జనంలో బీఆర్ఎస్కు ఆదరణ, కేసీఆర్ పట్ల కృతజ్ఞతకు వారి శోకాలే సాక్ష్యం. పార్టీలు వేరైనా వాళ్ల కామన్ ఎజెండా మాత్రం కేసీఆర్ను తిట్టడమే.
బీజేపీలో ఉండి, కాంగ్రెస్తో మంతనాలు. కాంగ్రెస్లో ఉండి బీజేపీతో బాతాఖానీలు. కేసీఆర్ను గద్దె దించే పార్టీలో చేరుతాం అని మధ్యలో ఇంకో రకాలు. వాళ్ల దివాలాతనంలోని విషాదం ఏమిటంటే ఓడిస్తాం, ఓడిస్తాం అని విరామం లేకుండాముచ్చట్లు పెట్టడం. పైగా వారి పార్టీలపై, వారిపై వారికి విశ్వాసం లేక పొరుగు రాష్ట్ర మహిళా నేత కోసం పొలిటికల్ బిజినెస్ చేస్తున్నారు. ఊ అంటే బెంగళూరు, ఆ అంటే ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఇంతకీ ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఉంటారో వారికే తెలియదు. ఇగ వీళ్లూ, వీళ్ల పార్టీలు తెలంగాణలో అధికారంలోకి వస్తాయట.
రాష్ర్టాన్ని వెలగబెడతాయట. జనంలో ఒకరో ఇద్దరో తాము పలికే ఊహాజనితాలు, దుష్ప్రచారాలు నమ్మకపోతారా అనే దింపుడు కళ్లం ఆశ పైనే పూర్తిగా ఆధారపడ్డారు. జనంలో ఉండి, జనం కోసం పనిచేయడం చేతకాదు. కొన్ని రోజులు బీజేపీని కేసీఆర్ లేపుతున్నారని అప్పట్లో కాంగ్రెస్ లీడర్లు దీర్ఘాలు తీశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ను జాకీలతో ఎత్తుతున్నారని బీజేపీ నేతలు సెలవిస్తున్నారు. అంటే కేసీఆర్ లేపితే తప్ప లేవలేని పార్టీలు తమవని చెబుతున్నట్టే కదా? ఇవన్నీ ఎటూ పాలుపోని, నైరాశ్యం ఆవరించిన నిందాస్తుతులే. ఎందుకంటే కేసీఆర్ తమ పార్టీ ఇంకా కనీసం వంద అసెంబ్లీ స్థానాలు, పదిహేను లోక్సభ సీట్లతో అఖండ విజయం సాధించాలనే లక్ష్యంతో రాజకీయ ప్రణాళికలు రచిస్తారు తప్పితే, ఎండిపోయిన విపక్ష పార్టీలు చిగురించి ఎదుగాలని ఎందుకు కోరుకుంటారు?
అసలు విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రజా క్షేత్రంలో బలంగా ఉన్నది. సింహభాగం జనం హృదయాల్లో కేసీఆర్ గొప్ప స్థానంలో ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారు ఫలాలను మెజారిటీ కుటుంబాలు అనుభవిస్తున్నాయి, ఆస్వాదిస్తున్నాయి.
దాదాపు ప్రతి ఇంట్లో, ఆఖరికి ప్రతిపక్ష నాయకుల ఇండ్లకూ, పొలాలకు, జేబులకూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం జలాలు, రైతుబంధు సొమ్ములు చేరుతున్నాయి. పాలబుగ్గలోళ్లు మొదలు పండుటాకుల వరకూ ప్రతి ఒక్కరూ కేసీఆర్ ప్రభుత్వ పుణ్యమాని ఏదోఒక ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని అందుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను తప్ప మరొకరిని నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజల తిరుగులేని మద్దతు, స్వచ్ఛమైన దీవెనలతో పార్టీ అధ్యక్షులుగా భారత రాష్ట్ర సమితిని దేశమంతటా విస్తరిస్తున్నారు కేసీఆర్. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా తన సారథ్యంలోని ప్రభుత్వం ద్వారా రాష్ర్టానికి, ప్రజలకు మేలు తలపెడుతూనే ఉన్నారు. అందుకే కేసీఆర్ తమ మేలుకోరి పని చేస్తారనేది ప్రజల మనసులో నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ మొదటిసారి ఎన్నికల్లో జనం తీర్పు కోరినప్పుడు 63 సీట్లతో సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. రెండో పర్యాయంలో ప్రజా మద్దతు మరింత పెరిగింది. ఏకంగా 88 సీట్లకు ఎగబాకింది. మొదటిటర్మ్కు రెండోసారికి పోల్చితే పాతిక సీట్ల వృద్ధి నమోదైంది.
రాబోయే ఎన్నికల్లో అది నూరు సీట్లకు చేరడానికి ఒకటి, రెండోటర్మ్ల చరిత్రే పునాది. అంటే, ఈసారి వంద శాసనసభ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ విజయం తథ్యమని తేలిపోయింది. తద్వారా వరుసగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభు త్వం తెలంగాణలో కొలువు దీరనున్నది. మూడవసారి అధికారం చేపట్టడం అంటే మాటలు కాదు. ఇది సాదా సీదా రికార్డు కాబోదు. తెలుగు నేలపైనే కాదు, మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఒకే పార్టీ సర్కారు, ఒకే లీడర్ సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి అవడం తొట్టతొలిసారి. ఇది కూడా ఘనత వహించిన మన విపక్షాలకు జీర్ణం కానిది. దీన్ని తలుచుకునే వెక్కివెక్కి ఏడుస్తున్నారు. బీఆర్ఎస్ను ఓర్వడం లేదు. కేసీఆర్ పై దినాం ఆరోపణలే చేస్తున్నారు. అందుకే, ఈ ప్రతిపక్ష పార్టీలు, సంస్థల నరదృష్టి కేసీఆర్కు తగులకుండా దిష్టి తీయాలి.
(వ్యాసకర్త : ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
ఇల్లెందుల దుర్గాప్రసాద్ 94408 50384