24 గంటల నిరంతర విద్యుత్తు ఇచ్చింది బీఆర్ఎస్. కానీ, విసన కర్రలతో విసురుకొని సరిపెట్టుకొండని కాంగ్రెస్ చెప్పకనే చెప్తున్నది. రాత్రిళ్లు కరెంటు వచ్చాక, బావుల దగ్గరికి వెళ్లి మోటర్లు వేసుకునే పరిస్థితి లేకుండా చేశామని బీఆర్ఎస్ గొంతెత్తి చెప్తున్నది. 24 గంటల కరెంటు ఎందుకని, రైతులకు 3 గంటల కరెంటు చాలునని చెప్తున్న కాంగ్రెస్ను చూడండి.
కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునే దశ లేకుండా చేశామని బీఆర్ఎస్ అంటున్నది. కర్ణాటకలో ఫీజులు ఎగిరిపోయిన కరెంటును తెలంగాణ అంతటా తెస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. తెలంగాణ వెలుగు జిలుగుల వన్నెతో దేదీప్యమానంగా వెలుగుతున్నదని బీఆర్ఎస్ ఘంటాపథంగా చెప్తున్నది. మళ్లీ గతకాలపు చీకట్లలోకి తీసుకుపోతామంటున్న కాంగ్రెసు కథలు వింటున్నారా?
‘దళితబంధు’ లాంటి పథకాలను తెచ్చి విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దళితుల జీవితాల్లో నూతన వెలుగులు తెచ్చామని, ఈ దేశంలో ఎవరూ చేయలేని పని మేం చేశామని బీఆర్ఎస్ చెప్తున్నది. దళితబంధుకు అడుగడుగునా అడ్డుపడుతూ దళితవాడల్లోనే మగ్గిపోండని కాంగ్రెస్ విధానాలు 75 ఏండ్లుగా చెప్పకనే చెప్పాయి. ఆర్థికవ్యవస్థను నడిపే శక్తులుగా, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా దళితులు నిలవాలని, దళిత ఆర్థిక వ్యవస్థలుగా వాళ్లు గెలవాలని కోరుతూ కేసీఆర్ దళిత సంక్షేమకారుడిగా నిలిచాడు. 75 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఊరికి దూరంగా దళితవాడల్లో మగ్గుతూ బతుకీడ్చేలా చేసిన కాంగీ, బీజేపీలను దళితులు నమ్ముతారా అన్న ప్రశ్నను ఆ పార్టీలే వేసుకోవాలి. సంక్షేమ పథకాలంటే అవి దళిత, బహుజన పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలన్న దార్శనిక ఆలోచనలతో కేసీఆర్ రూపొందించిన పథకాలన్నీ పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదం చేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుకుంటూ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ ధీమాగా చెప్తున్నది.
75 ఏండ్లుగా పేదలను మరింత నిరుపేదలుగా మార్చి ఆత్మహత్యలు చేసుకునే దశకు తీసుకుపోయిన ఆయా పార్టీలను కోరుకోవాలా వద్దా అన్నది చైతన్యవంతులైన ప్రజలే తేల్చిచెప్తారు. రైతుబంధుతో రైతుకూలీల నేస్తంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించి గ్రామవెలుగై నిలుస్తున్న బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని వాళ్లు కోరుతున్నారు. పత్తి రైతుల ఆత్మహత్యల క్షేత్రంగా బీడుభూముల మట్టిదిబ్బలుగా చేసి రైతులను బిచ్చగాళ్లుగా మార్చిన పార్టీలు ఎవరో ప్రజలు గుర్తించగలరు, నిగ్గుదేల్చి చెప్పగలరు. వలసల తెలంగాణను పచ్చటి పాలమూరుగా మార్చి పసిడి పంటల క్షేత్రంగా చేసిన బీఆర్ఎస్కు అండగా నిలవాలని ఆ పార్టీ కోరుతున్నది. పల్లెలు కన్నీరు పెట్టించి కానరాని కుట్రలు చేసి ఓట్లు, సీట్ల కోసం నాలుగు కాళ్ల కుర్చీల గద్దెల కోసమే తండ్లాడే కాంగ్రెస్, బీజేపీల అసలు నైజాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపట్టగలరు.
హైదరాబాద్ నగరాన్ని అధికార కుర్చీల కుస్తీ పోటీల కోసం కత్తిపోట్ల కేంద్రంగా మార్చి మతఘర్షణలకు వత్తాసు పలికిన పార్టీ ఏదో ప్రజలు గుర్తించగలరు. కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో, గంగా జమునా తెహజీబ్ సంస్కృతితో దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు.
సాంఘిక, సంక్షేమ హాస్టళ్లంటే పురుగులన్నానికి కేంద్రాలనే భావనను తుడిచివేసి పేద విద్యార్థుల కంచాల్లోకి రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్న స్థితికి తెచ్చుకున్నాం. మహాత్మా జ్యోతిబాపూలే ఆలోచనల కొనసాగింపుగా దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీవర్గాల గురుకులాలు నెలకొల్పుకున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ ఆలోచనలు దేశమంతా విస్తరించాలని తెలంగాణ దారిచూపుతున్నది. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమే ఈ ప్రాంత అభివృద్ధికి ఆయువుపట్టుగా నిలుస్తుంది. ఈ పదేండ్ల పాలన పేదవర్గాలకు అండదండలిచ్చిన పాలనగా ఊరవతల వెలివాడల్లో మూలుగులను విని, అట్టడుగు పొరల్లో అభివృద్ధి నమూనాలు తీర్చిదిద్దిన ఒక చారిత్రక సందర్భంగా, చేతివృత్తులకు చేయూతగా, గీత, నేతలకు నిజమైన అండదండగా చేతల ప్రభుత్వంగా తెలంగాణ నిలిచింది. ఇది ఉండాలి. ఈ ఆలోచనలు కొనసాగాలి. తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా ఎలా నిలిచిందో అన్ని రంగాల్లోనూ పరిపుష్ఠంగా ఎదగాలని ఈ ఎన్నికల వేళలో చర్చ జరగడమే ప్రజాస్వామ్యానికి ప్రాణంగా నిలుస్తుంది.
-జూలూరు గౌరీశంకర్