మొన్న జరిగిన ‘లద్ధాక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సెల్ ’ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మొత్తం 30 స్థానాల్లో 4 నామినేటెడ్ స్థానాలు పోగా మిగిలిన 26 సీట్లలో బీజేపీ 2 స్థానాలకే పరిమితమైంది. 22 స్థానాలను నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి గెలుచుకున్నది. ఇది రానున్న ఎన్నికలకు శుభసూచకం కానున్నదని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీకి ఒక ఎంపీ ఉన్నా ఎన్నికలపై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోవడం గమనార్హం.
బీజేపీ ప్రభుత్వం 2019లో జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రత్యే క ప్రతిపత్తిని రద్దుచేసింది. బీజేపీ పార్లమెంటులో తనకున్న తిరుగులేని మెజారిటీతో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఆ రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీసింది. ఇది జరిగి నాలుగేండ్లు గడిచినా బీజేపీ స్థానిక ప్రజల్లో విశ్వాసాన్ని పొందలేకపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే స్థానికులకు బీజేపీపై ఇంకా ఆగ్రహం చల్లారలేదని స్ప ష్టంగా అర్థ్ధమవుతుంది.
కేంద్రపాలిత ప్రాంతంగా మారితే లద్ధాఖ్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎన్నికల్లో బీజేపీ విస్తృతంగా ప్రచారం కూడా చేసింది. కానీ స్థానిక ప్రజలు ఆర్టికల్ 370 రద్దు చేయటంతో తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన సహజ వనరులు, ఉద్యోగాల మీద తమ హక్కులను అయిష్టంగా, బలవంతంగా వదులుకోవాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. ఇదే విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రజలు ఈ వాదానికే ఎక్కువ విలువనిచ్చినట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అనేకమంది కేంద్ర మంత్రులను ప్రచారంలోకి దించింది. అనేక వాగ్దానాలను చేసింది. కనీసం10 స్థానాలైనా దక్కకపోతాయా?అని అంచ నా వేసింది. కానీ ఈ ఫలితాలు బీజేపీని తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉంటే ముస్లిం మెజారిటీ ఉన్న కార్గిల్ ప్రాంతంలోకి బీజేపీ చొచ్చుకొని వచ్చి విజయం సాధించిన ఘనత దక్కించుకొనేది. ముస్లింలతో పాటు బౌద్ధులు అధికంగా ఉన్న ఇతర జిల్లాలతో కూడిన లద్ధాఖ్లో ఈ ఓటమి బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే. బీజేపీ పరాజయం భవిష్యత్తు ఎన్నికలకు పునాదులు పడ్డట్టేనని విమర్శకులు భావిస్తున్నారు.
ఈ ఎన్నికల కోసం దేశంలో వివిధ ప్రాంతాలలో బతుకడానికి వలసపోయిన స్థానికులు సైతం తిరిగివచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.తమ అభీష్టాన్ని ఓట్ల ద్వారా స్పష్టంగా వ్యక్తం చేశారు. 78 శాతం ఓటింగ్ నమోదు కావడమంటే స్థానికులు ఈ ఎన్నికలను ఎంత సవాల్గా తీసుకున్నారో అర్థమవుతున్నది. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఇక్కడి బౌద్ధులు, ముస్లింలు, ‘షియా’ మతస్థులు,‘సున్ని’ మతస్థులు ఎటువంటి జాతి విభేదాలు లేకుండా ఐక్యంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక్కడి ప్రజలు ఉమ్మడిగా బలంగా ఒక్క టే కోరుతున్నారు. ఇక్కడి భూములు స్థానికులకు మాత్రమే దక్కాలి. అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకే దక్కాలి. తమదైన విలక్షణ సంస్కృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాలి.అందుకు అవసరమైన రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చెప్పినట్టుగా తమకు ప్రత్యేక ప్రతిపత్తినివ్వాలని గత నాలుగేండ్లుగా బౌద్ధులు, ముస్లింలు కలిసి ఇక్కడ ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వారి ఆకాంక్షలను పట్టించుకోవటం లేదు. తమను తిరిగి జమ్ముకశ్మీర్లో కలపాలని, లద్ధాఖ్కు పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ చెప్పిన రోడ్డు విస్తరణ కార్యక్రమాలు, విద్యాసంస్థల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర సాధారణ చర్యలు ఈ ప్రాంత ప్రజల ఆత్మాభిమానం, ప్రాంతీయాభిమానం, స్వేచ్ఛా ప్రియత్వం ముందు వెలవెలబోయాయి. స్థానిక అవసరాలు, ఆకాంక్షలతో పాటు అనేక ఇతర అంశాలు ఎన్నికల ముందు ఓటర్ల ప్రవర్తనా రీతులపై విభిన్నంగా పనిచేసి ఉండవచ్చు. బీజేపీ ఏలుబడిలో గత నాలుగేండ్లలో శాంతిభద్రతల పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రాలేదని స్థానికులు అంటున్నారు.
ఇటీవల జమ్ము కశ్మీర్లో చోటు చేసుకున్న అతిపెద్ద ఉగ్రవాద చర్యలతో సహా అన్ని సంఘటనలు శాంతి భద్రతలు సజావుగా లేవని స్పష్టంగా చెప్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాట్లు కూడా పూర్తిగా ఆగలేదు. ఇంటర్నెట్ను నెలల తరబడి నిలిపివేయటం. సైనికుల భారీ బందోబస్తుతో అడుగడుగునా కంచెల నిర్మాణాలతో, పాక్షిక, దీర్ఘకాల కర్ఫ్యూలతో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని చెప్పలేం. దేశ, విదేశీ జర్నలిస్టులపై అనేక ఆంక్ష లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో స్థానిక ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా సంచరించగలిగే వాతావరణం,అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే శాంతి నెలకొన్నట్లుగా భావించాలి.
గత ఐదేండ్లుగా కేంద్ర పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటం లేదు. ఈ అంశంలో ఎప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఇప్పటికే డీలిమిటేషన్ ప్రక్రియ ముగిసింది. రెండుసార్లు ఓటర్ల జాబితాలు సవరణలు చేశారు. అయినా కూడా అసెంబ్లీని పునరుద్ధరించే విషయంలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తున్నదో అర్థం కావడం లేదు. కేంద్రం సుప్రీంకోర్టులో సైతం ఎన్నికల నిర్వహణకు హామీ ఇచ్చింది. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదం నశించిపోయిందని ప్రభుత్వమే నిక్కచ్చిగా అం టుంది. అలాంటప్పుడు లెఫ్ట్టెనెంట్ గవర్నర్ పాలనను ప్రజలు ఇంకెంతకాలం భరించాలి? స్థానిక ప్రజల అభీష్టం మేరకు సకాలంలో ఎన్నికలు నిర్వహించి జమ్ము కశ్మీర్లో శాంతిభద్రతలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని ఆశిద్దాం.
-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
98493 28496