ఆధునిక జీవనంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జీవన విధానం మారింది. జీవించే విధానం మారింది. జీవితాల్లోని, అందాలన్నీ క్రమక్రమంగా కంప్యూటరైజ్డ్ అయిపోతున్నాయి. జ్ఞాపకాల ఫ్లాపీలతోనే బతకడానికి అలవాటు పడుతున్నారు జనం. వారసత్వం మీద, సంప్రదాయాల మీద, జాతి సంస్కృతి మీద, జరుపుకునే సంబురాలకు, వాట్సాప్లో శుభాకాంక్షలు పంపుకొంటూ ఈ-బతుకులు బతుకుతున్న ఈ రోజుల్లో, అనేక గ్రీష్మాల మధ్య తొలకరి జల్లులాంటిది బతుకమ్మ పండుగ. ఎందుకంటే, ఇది రంగు రంగుల పండుగ. ఆకులతో పాటలతో, ఆటలతో మొత్తంగా ప్రకృతితో మమేకమైపోతూ, మనసుని ఉల్లాసవంతం చేసే పండుగ బతుకమ్మ.
సాంకేతిక విప్లవం పంజా విసిరిన ఈ ఆధునిక రోజుల్లో బంధాల అర్థాలు మారిపోతున్నాయి. ఎవరి నిఘంటువులు వారే రాసుకుంటున్నారు. ఎవరి జీవితాలు వారివే అయిపోయాయి. మనుషులతో అవసరాల్లేకుండా జీవితాలు గడిపేస్తున్నారు. ఒంటరితనంతో జీవించడం ఎందుకు, ఈ జీవితం మనది, దీని తర్వాత ఉన్న జీవితం కూడా మనదే, అనే ఓ పాజిటివ్ ఆలోచనా విధానాన్ని మనకు సాంస్కృతికపరంగా అందించే పండుగ. మంటితో, మింటితో, నీటితో, ప్రకృతితో మానసికంగా మమేకమయ్యే పండుగే ఈ బతుకమ్మ పండుగ.
అసమాన సమూహాల మధ్య, భిన్న మనస్తత్వాల మనుషుల మధ్య సామరస్యం, వైవిధ్యం, సృష్టి ధర్మం బోధించే పండుగ బతుకమ్మ. ఇది వారసత్వం. తెలంగాణ ప్రజల జీవితాల్లో విడదీయని భాగమైపోయింది. అందుకే పదిరోజుల పాటు, బతుకమ్మ పాటలను గుండెలకు హత్తుకుం టూ, గొంతులకు తీపిదనాన్ని అందిస్తూ, గతించిన తెలుపు నలుపు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రంగురంగుల పూల మయం చేసే పండుగ. పల్లె, పట్టణం, ఊరూ వాడా, వీధి, గుడి, బడి అంతటా పండుగ వాతావరణమే. ఒక్కసారి వాతావరణం, ప్రపంచం పూలమయమైపోతుంది. నేల పూలతో తివాచీలా మారిపోతుంది.
పూల అమరికలోనే జీవన పరమార్థం ఉన్నది. వేదాంతం ఉన్నది. ఆధ్యాత్మికత ఉన్నది. మొదటి వరుస వెడల్పుగా ఉండి, రాను రాను సంఖ్య తగ్గిపోతుంది. కింద వెడల్పుగా చేసిన అమరిక మానవ జీవితంలోని అందమైన బాల్యాన్ని గురించే చెప్తుంది. ఆ అమాయకపు రోజుల్లో ఎంతో మంది మన వెంట ఉంటారు. పెద్దవారి చాటున గడిపే జీవితాలు అవన్నీ కూడా.
ఆ తర్వాత వయసు పెరుగుతుంది. మన చుట్టూ ఉన్నవారిలో కొంతమంది తగ్గుతారు. యవ్వనపు రోజులు ప్రపంచమంతా ఆనందాల రంగులమయం. అందుకే అన్ని సున్నితంగా చిరుగాలికే ఊగే గునుగుపూలు, నాజూకైన తామర పూలు, మెత్తనైన బంతిపూలు, కనువిందు చేసే మందారాలు అన్నీకూడా ఆ దశను చెప్తాయి. జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. పువ్వులన్నీ కూడా తడిసి ముద్దయిన అమ్మాయిల్లా కనిపిస్తాయి. అన్నింట్లో అందం. ఆ తర్వాత వరుసలన్నీ వివిధ దశలే, స్నేహితుల సంఖ్య తగ్గుతుంది. బంధువుల సంఖ్య తగ్గిపోతూ చివరగా ఒక్క పువ్వు మిగులుతుంది. ఇదే ఈ పండుగలోని అంతరార్థం. అందుకే ఇది ఏకత్వంలోని భిన్నత్వం. ఇదే జీవితంలోని తాత్వికత. జీవితంలోని తొలిదశలో ఎంతోమంది ఉంటారు. కానీ, చివరికి మిగిలేది మనం ఒక్కరమే.
(అక్షరయాన్ సౌజన్యంతో)
-గంటి భానుమతి