దక్కన్ ప్రాంతాన్ని తెలుగురాజులు పాలించిన తర్వాత బహమనీ రాజులు ఆక్రమించుకున్నారు. వారు బీదర్, బీరార్, అహమద్నగర్, బీజాపూర్, గోల్కొండ అనే అయిదు రాజ్యాలను పరిపాలించారు. గోల్కొ ండ రాజధానిగా తెలంగాణలోని పలు ప్రాంతాలను పరిపాలించారు. వీరు ఇక్కడ ప్రజలతో కలిసి పోయి ఇక్కడి సామంతరాజులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. అంతేకాక ప్రజలకు ఉప యోగపడే అనేక నిర్మాణాలు చేపట్టారు. వారి సౌకర్యార్ధం చెరువులు, బావులు, విద్యాలయాలు నిర్మించి, శాసనాలు వేయించారు. అటువంటి ఒక శాసనమే దర్పల్లిశాసనం. బహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ పరిపాలన కాలం లో వేయించిన ఈ శాసనం మెదక్ జిల్లా, యెల్దుర్తి మండలంలో ఉన్నది. శాసన కాలం శ.సం. 1375 = క్రీ.శ. 1453 శ్రీముఖ సంవత్సరం, చైత్ర శుద్ధ దశమి, ఆదివారం.
శాసనం ప్రారంభంలో యాదవ వంశానికి చెందిన అన్న, మల్లయ, వెన్నయ, కాచ అనే నలుగురు అన్న దమ్ములు పేర్కొనబడ్డారు. ఇందులో పెద్దవాడైన అన్న మల్లమాంబ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి నాగయ, కేశవయ, మాచయ అనే ముగ్గురు సంతానం. ఇందులో పెద్దవాడైన నాగయ నాగ మాంబను పెండ్లి చేసుకోగా వారికి కాచన, పన్నయ, లింగ అనే కుమారులు కలిగారు. ఇందులో పన్నయ కూతురు కసవాంబను బహమనీ రాజైన అల్లావుద్దీన్ కిచ్చి పెండ్లి జరిపించారు. ఈ కసవాంబ తన తండ్రి పేర దర్పల్లిలో పన్న సముద్రమనే చెరువును తన కూతురైన జాయకు పుణ్యార్థంగా నిర్మింపచేసింది.
దేవాద్రి పట్టణాన్ని పాలిస్తున్న యాదవ రాజైన పన్నకు ఈ శాసనంలో చాలా విశేషంగా యాదవ రాజులకు వంశ పారంపర్యంగా వస్తున్న బిరుదులన్నీ చెప్పబడినవి. ‘సమస్త జలధి వేలా వలయుత మహా మండల మండనాయమాన దేవాద్రి పట్టణ పట్టబద్ద విరాజమాన చర్తిగండ, గండ గోపాల రాచదళ విభాళ గాయ గోవాళ, భుజబల భీమ, సోమకుల పరశురామ కాకెతే రాజ్య స్థాపనాచార్య, ఖడ్గ నారాయణ, హిందూ రాయసురత్రాణరాయ, వేశ్యా భుజంగమాడి….సప్తసంతాన జత ప్రతాపానుమోదితా, నాగధీమణి నందన సజ్జనానందన… దీపక యాచక జన మనః కామనా మంది మందార పుష్పసదృశ లక్షణ విచక్షణమానంద గౌరమాభిదాన…..వంటి బిరుదాళుశాసనంలో మనం గమనించవచ్చు.
ఇందులో కసవాంబ సుందరీ జాతా సా కసవాంబా గుణ నికురుంబా నిజ వదన విజిత శశిబింబా, ధన్యా శ్రీమధలావధృశ్వర సురత్రాణస్య రాణీ పదం ప్రాప్తాబంధు జనానురంజన విధా ప్రత్యక్ష చింతామణి: నానాధిక సంవిధాన వినుత ప్రాగల్బ్య సంపాదనే రమా సా కసవాంబికా విజయతే రంభేన సంభావని’ అని వర్ణించబడింది.
అదేవిధంగా శాసనంలో కొండ కింద ఉన్న కొంత భూమిని వృత్తుగా పెరుమాళ్ళకు, పర్వతాద్రి అయ్యకు, భోగయ లింగానకు, మైలార దేవునికి, భైరవునికి, తిరుణాములకు, మల్లవీరులకు, శాసనం చెప్పిన భారతీ భట్టుకు సమర్పించారు.
బహమనీ సుల్తానుల పాలనలో తెలుగు భాష తన ఉనికిని కోల్పోలేదనడానికి ఈ శాసనం ఒక నిదర్శనం.