చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోనివారు చేసిన తప్పునే పదే పదే చేస్తూ పోయే దుర్గతికి లోనవుతారని సామెత. రైలు ప్రమాదాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఒడిశాలో ఘోర రైలు దుర్ఘటన జరిగి ఐదునెలలు పూర్తి కావడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉంది. బహనాగబజార్ స్టేషన్ సమీపంలో జరిగిన ఆ ప్రమాదంలో 280కి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొన్నాయి. సిగ్నలింగ్ లోపం అన్నారు. దర్యాప్తు కమిటీ వేశారు. ఆ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలియదు.
ఉగ్రవాద కోణాన్ని కూడా పరిశీలిస్తున్నామని రైల్వేమంత్రి చేసిన ప్రకటనపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కంటకాపల్లి వద్ద మరో ఘోర దుర్ఘటన జరిగింది. మరోసారి రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొన్నాయి. 14 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అంటున్నారు. బహనాగబజార్ ప్రమాదంపై దర్యాప్తు జరిపిన రైల్వే భద్రతా కమిషనర్ ఏఎం చౌదరి రైల్వేబోర్డుకు ఇచ్చిన నివేదికలో పలు కీలక సూచనలు చేశారు. సిగ్నలింగ్, మెయింటెనెన్స్ వ్యవస్థలను మెరుగుపర్చాలని, ఆమోదిత సర్క్యూట్, వైరింగ్ డయాగ్రాంలు సిబ్బందికి అందించాలని సూచించారు.
మూడోది, అతి కీలకమైందీ నైపుణ్యం గల సిబ్బంది నియామకానికి సంబంధించింది. రైల్వే వ్యవస్థను ఎప్పుడు ప్రైవేటుపరం చేద్దామా, అదానీకి కారుచౌకగా ఎలా కట్టబెడదామా అని ఉరుకులాడే సర్కారు వీటి గురించి ఏం చేసిందనేది ఇప్పుడు ప్రశ్న. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు రాకుండా ఆపే ‘కవచ్’ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది మరో కీలక ప్రశ్న. ‘కవచ్’ వ్యవస్థ రూపకల్పనకు పదేండ్లకు పైగా సమయం పట్టింది. గత జూన్ నాటికి 2 శాతం రైళ్లకు మాత్రమే దీన్ని అమర్చగలిగారు. ‘కవచ్’ వ్యవస్థ లేకపోవడం కారణంగానే ఒడిశా దుర్ఘటన జరిగిందని రైల్వే పరిశీలకులు అప్పట్లో ఎత్తిచూపారు. రైల్వే భద్రతా కమిషనర్ తన సిఫారసులు చేయనంత వరకు ఏమోలే అనుకోవచ్చు. కానీ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రమాదం తర్వాతైనా మేలుకున్నారా? అంటే అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. అయితే తాజా దుర్ఘటనలో ప్రమాదానికి గురైన రెండు రైళ్లకు కవచ్ వ్యవస్థ లేదని తెలుస్తున్నది.
అంటే కవచ్ విస్తరణ కార్యక్రమం నత్తనడకన సాగుతున్నట్టు అర్థమవుతున్నది. కవచ్ను నేరుగా కొనుగోలు చేయకుండా ఖర్చుకు భయపడి స్థానికంగా అభివృద్ధి చేసేం దుకు ప్రయత్నిస్తున్నారు. కవచ్ జాప్యానికి ఇది కూడా ఒక కారణం. ఫలితంగా రైల్వేల్లో భద్రత అగమ్యగోచరంగా తయారైంది. ఏపీ ప్రమాదం కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ రెండు ప్రమాదాల మధ్య పోలికలు మాత్రం ఉన్నాయని చెప్పొచ్చు. విజయానికి అందరూ తండ్రులే.. అపజయం మాత్రం అనాథ అన్నారు పెద్దలు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీరుకు ఈ నానుడి అద్దం పడుతుంది. ముఖ్యంగా రైల్వేల నిర్వహణ విషయంలో కేంద్ర సర్కారు ట్రాక్ రికార్డు ఏ మాత్రం సమర్థనీయంగా లేదు.
ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలతోనే రైల్వేల ప్రతిష్ఠ మసకబారుతున్నది. సాంకేతికత ఆకాశపుటంచులు చూస్తున్న ఈ రోజుల్లో భూమ్మీద రైళ్లను సురక్షితంగా నడపలేకపోతున్నదనే అపఖ్యాతి మూటగట్టుకుంటున్నది. గత పదేండ్ల బీజేపీ పాలనలో రైల్వేల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా తయారైంది. వరుస ప్రమాదాలు చూస్తుంటే ప్రభుత్వ శక్తి సామర్థ్యాల మీదనే అనుమానాలు కలుగుతున్నాయి. వందేభారత్ రైళ్లకు వందోసారి పచ్చ జెండా ఊపేందుకు ప్రధాని మోదీ వెనుకాడరు. వాటిముందు ఫొటోలు దిగడం, ప్రచారం చేసుకోవడంలోనూ ఎప్పుడూ ఆయన ముందుంటమే కాదు, ఆయనను మించినవాళ్లు దొరకరు. ఇటీవల నమో భారత్ అనే పేరులో తన పేరు కూడా చూసుకొని ఆయన మురిసిపోయారు. ఈ ఫొటోలు, ప్రచారం సరే.. భద్రత మాటేమిటి? ఒక ప్రమాదం జరిగిందీ అంటే వ్యవస్థను దుమ్ముదులిపి లోటుపాట్లను సరిచేయాలని ఎవరైనా చెప్తారు. కానీ అలాంటివేవీ మోదీ సర్కార్ డిక్షనరీలో ఉన్నట్టు లేదు.