‘2023, హైదరాబాద్లో రికార్డు స్థాయిలో 32,880 హౌజింగ్ యూనిట్ల అమ్మకాలు జరిగాయని, రెసిడెన్షియల్ లాంచ్లు 7 శాతం పెరిగి 46,985 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది ఆల్ టైం రికార్డు.’
– నైట్ ఫ్రాంక్ ఇండియా
‘ఇండియా రియల్ ఎస్టేట్-రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్’పై నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక తెలంగాణ సమాజానికి గర్వకారణం కాగా కేసీఆర్ దార్శనికతకు నిలువెత్తు దర్పణం.
ఆరున్నర దశాబ్దాల పరాయి పాలనలో మత కలహాలకు, అస్థిరమైన ప్రభుత్వాలకు, అదుపులో లేని శాంతిభద్రతలకు కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ను దేశంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దార్శనికతను మరువలేం. సాధారణంగా స్థిరమైన ప్రభుత్వం, అంతర్జాతీయ స్థాయి శాంతిభద్రతలు, మెరుగైన వసతులు, విశాలమైన రవాణా వ్యవస్థ, సులభమైన పారిశ్రామిక అనుమతులతో పాటు భవిష్యత్తుపై భరోసా ఉన్న రాష్ర్టాల్లో మాత్రమే బహుళజాతి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తాయి.
అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి సానుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ప్రజల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడితే, రాష్ట్ర ప్రగతి, ప్రజల అభివృద్ధి, పెట్టుబడుల కల్పన అసాధ్యమనే విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యుత్తమమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆది నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతి, అభివృద్ధి, పేదరిక నిర్మూలన, రాష్ట్ర పౌరుల రక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అట్లాగే అంతర్జాతీయ పెట్టుబడులను రాబట్టడం, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చారు.
తద్వారా.. ఉమ్మడి రాష్ట్రంలో మత కలహాలకు, ఉగ్ర దాడులకు, దోపిడిదారులకు, ల్యాండ్ మాఫియాకు నిలయమైన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం కేసీఆర్ సారథ్యంలో పదేండ్లలోనే గంగా, జమునా సమ్మిళిత సంస్కృతికి నిలయంగా మారింది. దీంతోపాటు కాస్మో పాలిటన్ సిటీ నుంచి మెట్రో పాలిటన్ నగరంగా ఎదిగి విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తూ పారిశ్రామిక, వ్యాపార, సేవా రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడులను, బహుళజాతి సంస్థలను ఆకర్షించింది. మెర్సర్ అనే ఓ అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే ‘సురక్షిత నగరం’గా గుర్తించింది. ఈ ఫలితాల వెనుక కేసీఆర్ దార్శనికత, కేటీఆర్ నిర్విరామ కృషి ఇమిడి ఉన్నవి.
ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం 2014కు ముందుతో పోల్చితే సుమారు 50 రెట్లు పెరిగింది. రూ.కోటికి మించి ఖరీదైన ఇండ్ల అమ్మకాలు ఐదేండ్లలో రెట్టింపయ్యాయి. 2018లో మొత్తం అమ్మకాల్లో ఇవి 21 శాతం ఉండగా 2023లో 49 శాతానికి పెరిగాయి. 2022తో 11,632 యూనిట్లతో పోలిస్తే 2023లో 16,086 యూనిట్లకు పెరిగాయి. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు(జీసీసీలు) తమ ఐటీ, బ్యాంక్-ఆఫీస్ కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తుండటంతో 2023లో హైదరాబాద్ ఆఫీసు మార్కెట్లో వార్షిక లావాదేవీల్లో 32 శాతం పెరుగుదల నమోదైంది.
గతంలో ఒక ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకొని కొంత అభివృద్ధి చేశారు. కానీ కేసీఆర్ ఆది నుంచి అభివృద్ధి వికేంద్రీకరణకు నాంది పలకడంతో హైదరాబాద్ నలు దిక్కులా ఐటీ, పారిశ్రామికాభివృద్ధి సాక్షాత్కరిస్తున్నది.తెలంగాణలో బహుళజాతి సంస్థల పెట్టుబడులన్ని వాస్తవరూపం దాల్చితే.. మరో పది, పదిహేనేండ్ల వరకూ నగరాభివృద్ధికి, రియల్ ఎస్టేట్ వృద్ధికి ఏ మాత్రం ఢోకా లేదని చెప్పవచ్చు. దేశంలోని ఏ నగరం చూసినా ఏదో సమస్య ఉన్నది. ముఖ్యంగా చెన్నైలో వరదలు, ఢిల్లీ కాలుష్యం.. ఇలా చాలా నగరాల్లో ఏదో ఒక సమస్య ఉన్నది. కానీ హైదరాబాద్లో ఎలాంటి సమస్యల్లేవు. అన్నీ బాగున్నాయి. ఐటీ విషయానికి వస్తే గ్రోత్ తగ్గే పరిస్థితి లేదు. ఐటీ గ్రోత్లో హైదరాబాద్ నగరం బెంగళూర్ను మించిపోయింది.
ప్రధానంగా బెంగళూర్, చెన్నై, ముంబై, ఢిల్లీతో పోలిస్తే… మన దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పారామీటర్లు.. ప్రజలు ఇక్కడికి వచ్చి పనిచేయడానికి, నివసించడానికి, పెట్టుబడులు పెట్టడానికి చక్కని వేదికగా చేశాయి. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే రారాజుగా మారింది. అయితే… నూతన ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ వృద్ధికి తోడ్పాటునందిస్తేనే భవిష్యత్తులోనూ హైదరాబాద్ కీర్తి మరింత పెరుగుతుంది. లుక్ ఆల్ ది డైరెక్షన్స్ అమలుచేస్తే భవిష్యత్తులో రియల్ రంగం మరింత పుంజుకుంటుంది.
(వ్యాసకర్త: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్)
జక్క వెంకటరెడ్డి