దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం, అత్యంత శౌర్యప్రతాపాలతో ప్రాణాలకు సైతం తెగించి దేశ సరిహద్దుల వద్ద పహారా కాయడం భారత త్రివిధ దళాల విధి. ఈ సందర్భంగా సాయుధ దళాలు ప్రదర్శించే దేశభక్తి, వారి ఆత్మైస్థెర్యానికి దేశ పౌరులంతా వందనం సమర్పించాల్సిందే. త్రివిధ దళాల్లో పనిచేసే వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వేర్వేరు సంక్షేమ ఫండ్లను ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ (ఏఎఫ్ఎఫ్డీఎఫ్) పేరిట ఒకే ఫండ్గా మార్చివేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవంగా (Armed Forces Flog Day) నిర్వహిస్తున్నారు.
దేశ రక్షణతోపాటు దేశంలో అంతర్గతంగా జరిగే అనేక విపత్కర పరిస్థితులను చక్కదిద్దడంలో ఆర్మీ, వైమానిక, నౌకా దళాలు నిరుపమానమైన సేవలను అందిస్తుంటాయి. దేశ ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించడంలో సాయుధ ధళాలు ముందు వరసలో ఉంటాయి. అసాంఘిక శక్తులు పెట్రేగి దేశ సుస్థిరతకు భంగం వాటిల్లి పరిస్థితి ప్రభుత్వం చేయి జారినప్పుడు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సైనికులు సేవలందించడం మనకు తెలుసు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేసి దేశ ప్రజలకు రక్షణ కల్పించే సమయంలో వీరమరణం పొందిన సందర్భాలను కూడా మనం వార్తల్లో చూస్తుంటాము.
త్రివిధ దళాల పతాక దినోత్సవమైన డిసెంబర్ 7న దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు ప్రాతినిధ్యం వహించే ఎరుపు, ముదరు నీలం, లేత నీలం రంగుల జెండాలను కేంద్రీయ సైనిక్ బోర్డు, రాజ్యసభ, జిల్లా సైనిక్ బోర్డ్ ద్వారా ప్రజలకు పంపిణీ చేసి విరాళాలు సేకరిస్తారు. దేశం కోసం అహర్నిశలు సర్వసన్నద్ధంగా ఉంటూ శత్రుమూకలతో భీకరంగా పోరాడే సైనికుల కుటుంబాలు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవటం అందరి బాధ్యత. ఆ బాధ్యతను సాధారణ దేశ ప్రజలు స్వీకరిస్తున్నారన్న భావనను వారికి కలిగించేలా విరాళాలను సేకరించడం ఫ్లాగ్ డే ప్రత్యేకత. విధి నిర్వహణలో భాగంగా క్షతగాత్రులైన సైనికులకు పునరావాసం కల్పించడం, వారి కుటుంబీకుల సంక్షేమం, మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం, పునరావసం కల్పించడం కోసం ప్రత్యేకంగా సైనిక సంక్షేమ శాఖను స్థాపించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనిక పాటవాలను అంచనా వేసే ప్రఖ్యాత సంస్థ గ్లోబల్ ఫైర్పవర్ అంచనా ప్రకారం, భారతీయ సైన్యం 14.50 లక్షల క్రియాశీలక సిబ్బందిని కలిగి ఉన్నది. ఈ విభాగంలో భారత దేశం ద్వితీయ స్థానంలో ఉండగా మొత్తం 20 లక్షల క్రియాశీలక సిబ్బందితో చైనా మొదటి స్థానంలో ఉన్నది. భారత రాష్ట్రపతి సర్వసైన్యాధక్షుడుగా వ్యవహరించే ప్రధానమైన ఈ త్రివిధ దళాలతో (పదాతి దళం, వాయుదళం, నౌకాదళం) పాటు తీర రక్షక దళం, పారామిలటరీ దళాలు కూడా వీటిలో అంతర్భాగాలే.