దేశంలో ఎన్నో రాష్ర్టాలు కొత్తగా ఏర్పడినప్పటికీ భవిష్యత్తు పట్ల ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలకు సరైన స్పష్టత లేదు. దీంతో ఎజెండా రూపొందించుకోవడంలో, రాష్ర్టాలను అభివృద్ధి చేసుకోవడంలో ఆయా రాష్ర్టాలు విఫలమయ్యాయి. అందుకే ప్రజల ఆకాంక్షలనే ఎజెండాగా తీసుకొని టీఆర్ఎస్ ప్రజల ముందుకురావడంతో ప్రజలు ఆ పార్టీని తమదిగా భావించారు. 2014లో పలు రాజకీయపార్టీలు టీఆర్ఎస్పై ఎంత విషం కక్కినా పట్టించుకోక ప్రజలు అధికారాన్ని టీఆర్ఎస్కు అప్పగించారు.
2014లో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపొందించి ఆచరణలో పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే దశాబ్దాలుగా రాజకీయపార్టీలు ఆలోచించని అనేక వినూత్న పథకాలకు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తత్ఫలితంగా ప్రజల దీవెనతో రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను తెలియజేసింది. 2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ దేశంలో తమ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలన్న కుట్రలతో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి అనేక రాష్ర్టాల్లో అక్రమంగా అధికారాన్ని గుంజుకుంటూ ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నది.
రాష్ర్టాలను సంప్రదించకుండా అనేక రంగాల్లో ప్రజా వ్యతిరేక సంస్కరణలు తీసుకువస్తూ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది. ప్రజా పోరాటాలతో ఉనికిలోకి వచ్చిన అనేక కార్మిక చట్టాలను తొలగిస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలకూ తెరలేపింది. మోదీ సర్కారు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనేక ప్రజా వ్యతిరేక పనుల వల్ల దేశ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వరకు చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నది. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు నాయకత్వం వహించాల్సిన కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం నిర్మాణం కార్యాచరణ ఆలోచన లేకపోవడం వల్ల చతికిలపడిపోయింది. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిలువరించటంలోను, కాంగ్రెస్ను ఎన్నుకున్న రాష్ర్టాలను నిలుపుకోవడంలోనూ ఆ పార్టీ విఫలమైంది.
జాతీయపార్టీని స్థాపించడం మామూలు విషయం కాదు. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా పెట్టడం కేసీఆర్కే సాధ్యం అవుతుంది. జాతీయపార్టీ ఎజెండా ప్రకటించిన తర్వాత అన్ని రాజకీయపార్టీల్లో ప్రకంపనలు రావడం ఖాయం. దేశవ్యాప్త సమస్యలను, ఆకాంక్షలను సరైనరీతిలో ప్రతిబింబించి వాటికోసం నిలబడితే ప్రజల దీవెనలు తప్పకుండా ఉంటాయి.
జాతీయపార్టీపై భిన్నాభిప్రాయాలు రావడం సహజం. వాటికి జవాబు భవిష్యత్తు కార్యాచరణ చెప్తుంది. దేశంలో ప్రస్తుతం బీజేపీ పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత కేసీఆర్ స్థాపించే జాతీయ పార్టీకి బలమైన ప్రాతిపదికగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ, వాటి ఆకాంక్షలను గౌరవించి ఐక్య పోరాటాలతో తీసుకొచ్చే గొప్ప కార్యాచరణ కేసీఆర్ నాయకత్వంలో రూపొందనుంది.
టీఆర్ఎస్ జాతీయపార్టీగా అవతరించడం వల్ల తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లవచ్చన్న సందేహంలో వాస్తవం లేదు. ప్రాంతీ య అన్యాయాలను సరిదిద్దే, అస్తిత్వాలను సరైనరీతిలో గౌరవించి ‘ఫెడరల్ స్ఫూర్తి’తో వ్యవహరించే ఎజెండా రూపొందించి ముందుకుపోవాలి. కేసీఆర్ సాహసోపేతమైన ప్రస్థానానికి అందరం మద్దతు పలుకుదాం, నూతన రాజకీయ కార్యాచరణలో భాగమవుదాం. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం కావాలని తపన పడుతున్న వేలాదిమంది మేధావులకు ఈ జాతీయ పార్టీ ఒక వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తూ..
(వ్యాసకర్త: అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మాజీ ఉపాధ్యక్షులు)
-దేవి ప్రసాద్
90006 33404