లక్నో : నిత్యం వాదనకు, వేధింపులకు దిగుతున్న భార్య తీరుతో విసుగెత్తిన భర్త నెలరోజులుగా తాటిచెట్టుపై మకాం వేశాడు. 80 అడుగుల ఎత్తున్న తాటిచెట్టుపైనే రోజులు వెళ్లదీస్తున్నాడు. యూపీలోని మౌ జిల్లా కోపాగంజ్ ప్రాంతంలో ఈ అరుదైన ఘటన జరిగింది. గత ఆరు నెలలుగా భార్యతో గొడవ పడుతున్న రాం పర్వేష్ (42) దీనగాధ ఇది. భార్య తనతో రోజూ గొడవ పడటమే కాకుండా తనను కొడుతోందని, ఆమె ప్రవర్తనతో విసుగు చెందిన తాను తాడిచెట్టు ఎక్కి నెల రోజులుగా అక్కడే ఉంటున్నానని ఏకరవు పెట్టాడు.
కుటుంబ సభ్యులు ఆహారం, నీరును చెట్టుకు కట్టిన తాడుతో అతడికి చేరవేస్తున్నారు. అతడు తాడును పైకి లాగి ఆహారం, నీరు సేవిస్తున్నాడు. రాం పర్వేష్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు కొద్దిసేపు కిందకు దిగి మళ్లీ చెట్టుపైకి ఎక్కుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. చెట్టు దిగి భార్యను చేపట్టాలని తాము కోరుతున్నా అతడు వినడం లేదని గ్రామస్తులు వాపోయారు. రాం పర్వేష్ తమ మాటలు పెడచెవిన పెడుతుండటంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సర్ధిచెప్పినా పర్వేష్ వినకపోవడంతో వారు వీడియోలో రికార్డు చేసి వదిలేశారు. పర్వేష్ చెట్టుపైన తిష్ట వేయడంతో చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో ఏం జరుగుతుందనేది చూస్తుంటాడని, దీంతో తమ గోప్యతకు భంగం కలుగుతోందని ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేస్తున్నారని గ్రామ సర్పంచ్ దీపక్ కుమార్ చెప్పుకొచ్చారు. గ్రామానికి చెందిన పలువురు మహిళలు దీనిపై తమకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పోలీసులకు చెప్పినా వారు వచ్చి వీడియో తీసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు గ్రామస్తులు రోజూ వచ్చి అతడిని చూసి వెళుతున్నారని రాం పర్వేష్ తండ్రి శ్రీ కిషన్ రాం చెప్పారు.