హైదరాబాద్ ,జూలై :మనసుకు ఏ ఫీలింగ్ కలిగినా ఒక్కసారి ఆత్మీయులను ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు, ఒత్తిళ్లన్నీ పటాపంచలైపోతాయంటున్నారు పరిశోధకులు. బాధతో కుంచించుకుపోయినా, ఆనందంతో ఉప్పొంగిపోతున్నా, ఒత్తిడితో సతమతమైపోతున్నా… ఇలా ఎటువంటి ఫీలింగ్ అయినా ఒకరితో పంచుకోవడానికి ‘కౌగిలి’ వారధిలా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
రోగ నిరోధకశక్తి మెరుగవుతుంది…
ఆత్మీయులను, మనసుకు నచ్చిన వారిని గాఢాలింగనం చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే థైమస్ గ్రంథి ప్రేరేపణకు గురవుతుంది. దీనివల్ల శరీరంలో తెల్లరక్తకణాల ఉత్పత్తి మెరుగవుతుంది. ఇవి వివిధ ఇన్ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని రక్షించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. తద్వారా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
గుండెకూ ఆరోగ్యమే…
వ్యాయామం, మెడిటేషన్.. వంటివి చేయడం వల్ల ఆందోళనలు, ఒత్తిళ్లు తగ్గిపోయి గుండె, శ్వాసవ్యవస్థలు ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటాయో అలాగే కౌగిలించుకోవడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలే ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
మానసిక ఒత్తిడి దూరం…
ఇద్దరు వ్యక్తులు కౌగిలించుకోవడం వల్ల వారి శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తవుతుంది. ఇది వారిలో ఉండే ఒత్తిడి, ఆందోళన, బాధ, కోపం.. వంటి నెగెటివ్ భావాలతో పోరాడి వాటిని దూరం చేస్తుంది. అలాగే శరీరంలో సెరటోనిస్ స్థాయుల్ని కూడా పెంచుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత లభించి అనిర్వచనీయమైన ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే నచ్చినవారిని కౌగిలించుకోవడం వల్ల మనలో ఉండే నెగెటివ్ ఆలోచనలన్నీ తొలగిపోయి మనపై మనకు నమ్మకం, నిజాయతీ, ఆత్మగౌరవం పెరుగుతాయి.
రక్త ప్రసరణ…
కౌగిలింత ఇతరులపై ఉండే ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రమే కాదు.. శారీరకంగా రిలాక్సవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అదెలాగంటే.. గాఢంగా ఆలింగనం చేసుకోవడం వల్ల శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుందట. అలాగే కండరాలు, ఇతర శరీర భాగాల్లో ఉండే నొప్పులు మాయమై ప్రశాంతత సొంతమవుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.