లక్నో : ఫైనల్ ఎగ్జామ్స్ రాసేందుకు నవ వధువు పెండ్లి దుస్తులతోనే కాలేజీకి వెళ్లిన ఘటన యూపీలోని కుషాహ్రలో వెలుగుచూసింది. డిగ్రీ మూడవ సంవత్సరం సోషియాలజీ పరీక్ష రాసేందుకు జుదావతి వైష్ వివాహమైన వెంటనే శ్రీ ప్రమోద్ జీ మహిళా మహావిద్యాలయకు పెండ్లి దుస్తుల్లోనే వెళ్లింది.
మే 27న పెండ్లి మంటపం నుంచే ఆమె నేరుగా బీఏ పరీక్ష రాసేందుకు కాలేజ్కు చేరుకుంది. ఆమెకు అంతకుముందు రోజు రాత్రి వివాహం జరిగింది. పెండ్లి కావడంతోనే ఏడాది పాటు తాను పడిన కష్టాన్ని వృధా కాకూడదని తమ కూతురు నిర్ణయం తీసుకుందని ఆమె తండ్రి చెప్పారు.
తాను పరీక్షకు హాజరవుతానని పెండ్లి కొడుకుతో చెప్పగా ఆమె నిర్ణయానికి అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. జుదావతి వైష్ పరీక్షా కేంద్రం నుంచి తిరిగిరాగానే పెండ్లి తంతులో మిగిలిన కార్యక్రమాలు చేపడతామని పెండ్లికొడుకు తల్లితండ్రులు తెలిపారు. పరీక్ష హాలులో పెండ్లి బట్టలతో జుదావతి కనిపించడంతో ఆమె టీచర్లు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు.