వాషింగ్టన్: అంతరిక్షంలో కొత్త గ్రహాల కోసం శాస్త్రవేత్తలు అన్వేషణ దశాబ్దాలుగా సాగుతోంది. భూమివంటి గ్రహాలు ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్నాయా? ఉంటే అవి ప్రాణుల జీవనానికి అనుకూలమేనా? ఈ ప్రశ్నలతోనే శాస్త్రవేత్తల అన్వేషణ ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో తాజాగా మన పాలపుంత ఆవల మరో గ్రహం ఉన్నట్లు తాజాగా నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ) గుర్తించింది. నాసాకు చెందిన చంద్ర ఎక్స్రే టెలిస్కోప్ దీన్ని కనిపెట్టిందట. ఇలా పాలపుంత ఆవల కొత్త గ్రహాన్ని కనుగొనడం ఇదే తొలిసారి. భూమికి 28 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మెస్సియర్ 51 గెలాక్సీలో ఈ గ్రహం కనిపించింది.
ఎలా గుర్తించారు?
నాసాకు చెందిన చంద్ర అబ్జర్వేటరీ ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తుంది. అంతరిక్షంలో బద్దలయ్యే నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ చుట్టూ ఉండే పదార్థం, గెలాక్సీల గుంపులు అన్నీ కూడా ఒక రకమైన ఎక్స్రే కిరణాలను విడుదల చేస్తాయి. ఏదైనా గ్రహం అడ్డుగా వచ్చినప్పుడు వీటి నుంచి విడుదలయ్యే కాంతి తగ్గడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ విధానంతోనే అంతరిక్షంలోని వివిధ నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్న వేలాది గ్రహాలను వ్యోమగాములు గుర్తించారు. మనుషుల కంటికి కనిపించే కాంతి, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్లో వచ్చే తగ్గుదలను గుర్తించడం ద్వారా గ్రహాల ఆనవాళ్లు లభిస్తాయని కేంబ్రిడ్జిలోని హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్కు చెందిన డాక్టర్ రోసానె డి స్టెఫానో తెలిపారు.
ఏదైనా నక్షత్రం, బ్లాక్హోల్కు దగ్గరలో పరిభ్రమిస్తున్న గ్రహాలు.. సదరు నక్షత్రాలు, బ్లాక్హోల్స్కు భూమికి మధ్య అడ్డుగా వచ్చినప్పుడు వాటి నుంచి విడుదలయ్యే ఎక్స్రే కిరణాలు చాలా వరకు, ఒక్కోసారి పూర్తిగా బ్లాక్ అవుతాయని స్టెఫానో చెప్పారు. తాజాగా తమ అధ్యయనంలో సుమారు 3 గంటలపాటు ఈ ఎక్స్రే కిరణాలు పూర్తిగా బ్లాక్ అయినట్లు వెల్లడించారు.
దీంతో ఈ కిరణాలను అడ్డుకున్న గ్రహం సుమారు శనిగ్రహం పరిమాణంలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం అంతరిక్షంలో కొత్త గ్రహాలను గుర్తించడానికి దీని కన్నా ఉపయోగకరంగా ఉండే విధానం ఏదీ లేదని స్టెఫానో పేర్కొన్నారు.