చీకటి పడగానే ఆకాశంలో ప్రత్యక్షమై అందర్నీ పలకరించే.. చందమామపై ఒక కట్టడం ఉంటే? దానిలో ఎవరు ఉండే అవకాశం ఉంది? చైనాకు చెందిన రోవర్ పంపిన ఫొటోలు చూస్తే ప్రస్తుతం ఇవే అనుమానాలు తలెత్తుతున్నాయి. డ్రాగన్ దేశానికి చెందిన యూటు-2 అనే రోవర్.. చంద్రమండలంపై అధ్యయనం చేస్తోంది.
2019లో చంద్రుడిపై ల్యాండయిన ఈ రోవర్.. అప్పటి నుంచి అక్కడే తిరుగుతూ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేస్తోంది. చంద్రుడిపై ఉన్న వాన్ కర్మాన్ అగాధానికి 80 మీటర్ల దూరంలో ఒక కట్టడం లాంటి నిర్మానం ఈ రోవర్ కెమెరా కంటికి చిక్కింది. దీన్ని ప్రస్తుతానికి ‘మిస్టరీ హౌస్’ చైనా మీడియా పిలుస్తోంది.
ఇది భవనమో, ఏలియన్ల నిర్మాణమో అయ్యుండే అవకాశం లేదని, అయితే ఇది ఎలా ఏర్పడిందో తెలుసుకునేందుకు రోవర్ను ఆ కట్టడం వైపు పంపుతున్నామని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్నిరోజుల క్రితం ఇదే రోవర్ ఒక అగాధం అడుగున జెల్లీ వంటి పదార్ధాన్ని గుర్తించింది. అయితే పరిశోధనల అనంతరం ఇది రాయి అని తేలిన సంగతి తెలిసిందే.