టోక్యో: ప్రపంచంలోనే తొలి రైలును పోలిన బస్సును జపాన్ ప్రవేశపెట్టింది. డ్యూయల్ మోడ్ వాహనాన్ని (డీఎంవీ) ప్రజా రవాణా కోసం శనివారం అందుబాటులోకి తెచ్చింది. డీఎంవీ ఒక మినీ బస్సు, మినీ రైలు మాదిరిగా కనిపిస్తుంది. సాధారణ రబ్బరు టైర్లతో సంప్రదాయ రోడ్లపై నడుస్తుంది. దీని మరో ప్రత్యేకత ఏమంటే, ఈ వాహనం రైలు లాగా పట్టాలపై కూడా పరుగులు పెడుతుంది. ఇంటర్చేంజ్ స్టేషన్లలో యాక్టివేట్ అయ్యే స్టీల్ వీల్స్ను ఈ వాహనం కలిగి ఉంటుంది.
రైలును పోలిన బస్సు మాదిరిగా ఉన్న డ్యూయల్ మోడ్ వాహనాన్ని(డీఎంవీ) ప్రపంచంలోనే తొలిసారి జపాన్లోని కైయో నగరంలో క్రిస్మస్ రోజున ప్రారంభించారు. ఈ రైలు బస్సు రోడ్లపై నడుస్తున్నప్పుడు అసాధారణంగా కనిపించదు. అయితే ఇంటర్ఛేంజ్ స్టేషన్లలో ఈ వాహనం ముందున్న స్టీల్ వీల్స్ బయటకు వస్తాయి. దీంతో ముందు భాగంలోని రబ్బరు టైర్లు కాస్త ఎత్తులో పైకి లేస్తాయి. వెనుక రబ్బరు టైర్లు డీఎంవీని రైలు పట్టాలపైకి నెట్టుతాయి.
ఆ తర్వాత వెనుక వైపు కూడా స్టీల్ వీల్స్ బయటకు రావడంతో వెనుక ఉన్న రబ్బరు టైర్లు కాస్త పైకి లేస్తాయి. ఇలా ఈ డీఎంవీ రోడ్డుపైనా, పట్టాలపైనా నడుస్తుంది. రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, రోడ్డుపై వంద కిలోమీటర్లకుపైగా వేగంతో ఇది ప్రయాణిస్తుందని జపాన్కు చెందిన ఆసా కోస్ట్ రైల్వే తెలిపింది. డీజిల్తో నడిచే ఈ రైలు మాదిరి బస్సులో 21 మంది ప్రయాణించవచ్చని పేర్కొంది.
జపాన్లోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందించడంలో డ్యూయల్ మోడ్ వాహనం(డీఎంవీ) ఎంతో ఉపయోగపడుతుందని ఆసా కోస్ట్ రైల్వే సీఈవో షిగెకి మియురా రాయిటర్స్తో అన్నారు. ఈ రైలు మాదిరి బస్సు స్థానిక బస్టాండ్లలో ప్రయాణికులను ఎక్కించుకుని రైల్వే స్టేషన్లకు కూడా వారిని చేరుస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
డీఎంవీ సేవల ద్వారా దక్షిణ జపాన్లోని షికోకు ద్వీపం తీరం వెంబడి సుందరమైన దృశ్యాలను ప్రయాణీకులు ఆస్వాదించే వీలు కల్పించడటంతోపాటు పర్యాటక ఆదాయ వనరుగా కూడా ఉపయోగపడుతుందని మియురా వెల్లడించారు.