భోపాల్: ప్రపంచంతోపాటు దేశంలో బాగా పాపులర్ అయిన పులి ‘కాలర్వాలి’ వృద్ధాప్యంతో మరణించింది. దీంతో అటవీ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించి అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్కు చెందిన పులి టీ15ను ‘కాలర్వాలి’గా పిలుస్తారు. ఈ లెజెండరీ పులి 15 ఏండ్ల కంటే ఎక్కువగా జీవించింది. ఎనిమిది కాన్పుల్లో 29 పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ‘సూపర్ మామ్స్’ అనే బిరుదును దక్కించుకుంది. 29 పిల్లల్లో 25 వరకు బతికి పెద్దవయ్యాయి.
మాతరం అని కూడా పిలిచే ఈ ఆడపులి చివరిగా జనవరి 14న సీతాఘాట్ ప్రాంతంలో పర్యాటకుల కంటపడింది. వృద్ధాప్యం వల్ల నేలమీద పడి ఉన్న దానిని గుర్తించారు. కాగా, ఆ పులి శనివారం సాయంత్రం 6:15 గంటలకు టైగర్ రిజర్వ్లోని కర్మఝిరి ప్రాంతంలో మరణించిందని అటవీ శాఖ అధికారి అధర్ గుప్తా తెలిపారు. లెజెండరీ పులి ‘కాలర్వాలి’కి ఘనంగా నివాళి అర్పించి అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు.
మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా ఈ పులికి నివాళి అర్పించారు. కాగా, ఈ పులితో తనకు ఉన్న అనుబంధాన్ని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వరుణ్ ఠక్కర్ గుర్తు చేసుకున్నారు. “నాకు కాలర్వాలీతో అంతులేని జ్ఞాపకాలు ఉన్నాయి. 2006-07 నుండి దానిని, దాని పిల్లలను ఫోటో తీయడం నా అదృష్టం. పెంచ్కు ఇది ముగింపు. కాలర్వాలి సంతానం పులుల జనాభాను బాగా పెంచింది. నంబర్ వన్ టైగర్ రిజర్వ్గా చేసింది. ఆ పులి మరణం వ్యక్తిగత లోటు” అని పేర్కొన్నారు.