యువత అంతా చదువులు అయిపోగానే ఐటీ కొలువుల కోసం క్యూ కడుతుంది. పెద్ద పెద్ద ప్యాకేజీల కోసం చూస్తుంది. కానీ ఐటీ జాబ్ను కాదని ఓ వ్యక్తి గాడిద పాలు అమ్ముతున్నాడు. గాడిద పాలని చీప్గా తీసేయకండి. ఇప్పటికే ఈ గాడిద పాలకోసం రూ. 17 లక్షల ఆర్డర్లు కూడా సంపాదించి ఔరా అనిపిస్తున్నాడు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్గౌడ (42) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజీతో జాబ్ చేస్తుండేవాడు. 2020లో ఉద్యోగం మానేశాడు. తన సొంత గ్రామం ఇరాలో 2.3 ఎకరాల స్థలంలో ఇసిరి ఫామ్స్ ప్రారంభించాడు. సమగ్ర వ్యవసాయం, పశుసంవర్ధక, పశువైద్య సేవలు, శిక్షణ, పశుగ్రాసం అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పాడు. ప్రస్తుతం తన ఫామ్లో మేకలు, కుందేళ్లు, కడక్నాథ్ కోళ్లున్నాయి. ఈ నెల 8న అక్కడే గాడిదల ఫామ్ను ఓపెన్ చేశాడు. ఇలాంటి ఫామ్ కర్ణాటకలోనే మొదటి కాగా, దేశంలో రెండోది. ఇంతకుముందు ఒకరు కేరళలోని ఎర్నాకులంలో గాడిద ఫామ్ ప్రారంభించారు.
గాడిదలంటే అందరూ చిన్నచూపు చూడడం, తీసి పారేయడం తనకు బాధ కలిగించిందని, అందుకే గాడిదల ఫామ్ ప్రారంభించానని గౌడ చెబుతున్నాడు. ఇందులో 20 గాడిదలను పెంచనున్నట్లు తెలిపాడు. అధునాతన పద్ధతులు అందుబాటులోకి రావడంతో దోబీల సంఖ్య తగ్గుతోందని, దీంతో గాడిదలు కనుమరుగైపోతున్నాయని అన్నాడు. గాడిద ఫామ్ ఆలోచన చేస్తున్నప్పుడు చాలామంది తనను ఎగతాళి చేశారని గౌడ గుర్తుచేసుకున్నాడు.
గాడిద పాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో ఔషధ విలువలుంటాయి. అందుకే ఇవి చాలా ఖరీదు. చిన్న చిన్న ప్యాకెట్లతో గాడిద పాలను మాల్స్, షాపులు, సూపర్ మార్కెట్ల ద్వారా సరఫరా చేసేందుకు గౌడ యోచిస్తున్నాడు. 30 మిల్లీ లీటర్ల ప్యాకెట్ ధర రూ. 150 ఉంటుందని చెబుతున్నాడు. బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో కూడా ఈ పాలను ఉపయోగిస్తారని అంటున్నాడు. ఇప్పటికే తనకు గాడిద పాల కోసం రూ. 17లక్షల విలువైన ఆర్డర్స్ వచ్చాయని ఆనందంగా చెబుతున్నాడు శ్రీనివాస్గౌడ.