లండన్ : ఇరాకీ-కుర్ధిష్ సంతతికి చెందిన బ్రిటిష్ వ్యక్తి హజ్ యాత్ర కోసం ఏకంగా ఇంగ్లండ్ నుంచి మక్కాకు కాలినడకన చేరుకున్నాడు. ఇంగ్లండ్లోని ఓల్వర్హ్యాంప్టన్ నుంచి ఆడం మహ్మద్ (52) నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్ మీదుగా సౌదీ అరేబియా చేరాడు. పది నెలల 25 రోజుల పాటు కాలినడకన 6,500 కిలోమీటర్లు ప్రయాణించాడు. 2021 ఆగస్ట్ 1న బ్రిటన్లో బయలుదేరిన ఆడం మహ్మద్ గత నెలలో సౌదీ అరేబియాలో అడుగుపెట్టాడు. ఆదం సగటున రోజుకు 17.8 కిలోమీటర్లు నడిచాడని అల్ జజీరా పేర్కొంది.
తన వ్యక్తిగత సామాగ్రితో కూడిన తోపుడు బండితో ఆడం సౌదీకి చేరుకున్నాడు. ఈ తోపుడు బండికి మతపరమైన ప్రబోధాలను వినిపించేందుకు స్పీకర్స్ను అమర్చాడు. శాంతి సమానత్వ సందేశాన్ని చేరవేసే లక్ష్యంతో పాదయాత్రను ఆడం ఎంచుకున్నాడు. తాను ఇదంతా పేరు కోసమో, డబ్బు కోసమో చేయడం లేదని వర్ణం, జాతి, మతంతో నిమిత్తం లేకుండా మానవాళి అంతా ఒక్కటేననే సందేశం ఇచ్చేందుకే తాను ఇలా చేస్తున్నానని గోఫండ్మి పేజ్ను ఏర్పాటు చేసిన ఆడం చెప్పుకొచ్చారు. ఇస్లాం బోధించే శాంతి, సమానత్వ సందేశాన్ని తన యాత్ర ద్వారా వ్యాప్తి చేస్తున్నానని అన్నారు.
యాత్ర పొడవునా ప్రజలు తనపై అపార ప్రేమ కురిపించారని చెప్పారు. టిక్టాక్లో ఆడం తన యాత్ర విశేషాలను వెల్లడించగా ఐదు లక్షల ఫాలోయర్లను సొంతం చేసుకున్నాడు. తన గమ్యస్ధానం చేరుకున్న ఆడంకు సౌదీ అరేబియా మీడియా వ్యవహారాల మంత్రి మజిద్ బిన్ అబ్దుల్లా అల్ కుశబి స్వాగతం పలికి హజి పర్మిట్ లాంఛనాలను పూర్తి చేయడంలో సహకరించారు. రెండేండ్ల విరామం అనంతరం ఈ ఏడాది హజ్ యాత్ర కోసం పది లక్షల మంది ముస్లింలను అనుమతించింది. ఇక ఈ ఏడాది జులై 7న హజ్ యాత్ర ప్రారంభమైంది.