చెన్నై : దక్షిణాదిలో అమితంగా ఇష్టపడే వంటకాల్లో ముందుండే దోశ పలు వెరైటీల్లో, ధరల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అయితే తమిళనాడులోని తిరుచ్చిలో చిన్నతంబి దోశ షాప్ మాత్రం మిగిలిన వాటి కంటే భిన్నమైందిగా పేరుతెచ్చుకుంది. 2 రూపాయలకే ఆయన అందించే టేస్టీ దోశను రుచిచూసేందుకు స్ధానికులు ఎగబడుతుంటారు. ఇరుకైన వీధిలో చిన్నతంబి దోశ షాపు ఎదుట జనం బారులుతీరి కనిపిస్తారు.
సమీప రెస్టారెంట్లో చాలా ఏండ్లుగా పనిచేసిన చిన్నతంబి తక్కువ ధరలో పేదలకు కడుపునిండా ఆహారం అందించేందుకు సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనే చిన్నతంబిని సొంత హోటల్ వైపు నడిపించింది. ఎన్నో కష్టనష్టాలతో రాటుతేలిన చిన్నతంబి (49) ఒకప్పుడు ఖాళీ కడుపుతో పడుకున్న రాత్రిళ్లు చాలానే ఉన్నాయి. పేదరికం, ఆకలి రుచిచూసిన చిన్నతంబి తనలా ఎవరూ పస్తులతో పడుకోకూడదని రూ 10తోనే అందరి కడుపు నింపుతున్నాడు. చిన్నతంబి చిన్న దోశలను రూ 2కు అందిస్తుండగా రూ 3కే ఇడ్లీ, రూ 4కు ఉల్లి, క్యారెట్ వేసిన దోశను అందిస్తూ కస్టమర్ల ఆకలి తీరుస్తున్నాడు.
దోశలతో పాటు రెండు కుర్మాలు, రెండు చట్నీలు, సాంబార్ను ఎలాంటి అదనపు చార్జీ లేకుండా ఇస్తామని చిన్నతంబి చెబుతున్నాడు.ఇడ్లీ, ఊతప్ప, పరోట, ఆమ్లెట్ వంటి పలు వెరైటీలు ఉన్నా రూ 2 దోశనే అందరూ అడుగుతుంటారని చెప్పాడు. రోజూ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకూ చిన్నతంబి దోశ షాపు పేదల ఆకలి తీరుస్తుంటుంది.
తినేందుకు ఎక్కువ ఖర్చు పెట్టలేని వారంతా రూ పది నోటుతో తన దగ్గరికి వస్తే కడుపు నిండా తిని వెళతారని తనకు అదే కొండంత సంతృప్తి ఇస్తుందని చెబుతాడు. రోజుకు 800 దోశలు విక్రయించే చిన్నతంబి తన రాబడి అంతా మరుసటి రోజు సరుకు కొనేందుకు ఆపై దుకాణం కిరాయితో పాటు ఖర్చులకు సరిపోతుందని అయినా పేదల కడుపు నింపడంతోనే తాను ఎంతో సంపాదించిన సంతృప్తి అనుభవిస్తానంటాడు చిన్నతంబి. భార్య, ఇద్దరు కూతుళ్ల సహకారంతోనే తాను వ్యాపారాన్ని నెట్టుకొస్తున్నానని చెబుతున్నాడు.