Union Budget 2022 | మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్వం సన్నద్ధమైంది. ఇది ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కు నాలుగో వార్షిక బడ్జెట్. ఈ బడ్జెట్లో ఆదాయం సంపాదించుకునేందుకు వ్యక్తుల ఆదాయంతోపాటు వివిధ రంగాలపై పన్నుల విధానాన్ని ప్రతిపాదిస్తారు. అసలు భారత్లో ఈ బడ్జెట్లు ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యాయో తెలుసుకుందామా.. !
రాజకీయవేత్తగా మారిన స్కాటిష్ ఆర్థిక వేత్త జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ ఏడో తేదీన బ్రిటిష్ రాజకుటుంబం తరఫున ఈస్టిండియా కంపెనీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1947 నవంబర్ 26న తొలి ఆర్థికశాఖ మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి తొలి బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించారు.
ఇప్పటివరకు దేశ ఆర్థిక మంత్రులుగా పని చేసిన వారిలో ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2020 ఫిబ్రవరి ఒకటో తేదీన అత్యధిక టైం బడ్జెట్ ప్రసంగం చేశారు. 2.42 గంటలు మాట్లాడారు. మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే అస్వస్థతకు గురి కావడంతో స్పీకర్ ఓం బిర్లా ఆ స్పీచ్ ముగిసినట్లు భావిస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 2019 జూలైలో తొలి బడ్జెట్ ప్రసంగం చేసినప్పుడూ 2.17 గంటల సేపు మాట్లాడారు. ఇలా 2020లో తన రికార్డును నిర్మలమ్మ బ్రేక్ చేశారు.
పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991-92 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో అరుదైన రికార్డు నమోదు చేశారు. 18,650 పదాలతో కూడిన స్పీచ్ ఇచ్చారు. 2018లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్ స్పీచ్ 18,604 పదాలు. ఇది పదాల్లో రెండో స్థానంలో ఉంటుంది. జైట్లీ 1.49 గంటల సేపు మాట్లాడారు.
దేశ చరిత్రలో 1977లో నాటి ఆర్థిక మంత్రి హిరుభాయి ముల్జీభాయ్ పటేల్ 800 పదాలతో బడ్జెట్ ప్రసంగం పూర్తి చేశారు. అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. 1962-69 మధ్య మొరార్జీ దేశాయ్ 10 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత స్థానంలో పీ చిదంబరం 9, ప్రణబ్ ముఖర్జీ 8, యశ్వంత్ సిన్హా 8, మన్మోహన్ సింగ్ ఆరు బడ్జెట్లు సమర్పించారు.
1999 వరకు కేంద్ర బడ్జెట్లను పార్లమెంట్కు సమర్పించడంలో కేంద్ర ప్రభుత్వాలు బ్రిటిష్ వలస ప్రభుత్వ సంప్రదాయాన్నే కొనసాగించాయి. ప్రతియేటా ఫిబ్రవరి చివరి రోజు సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ సమర్పించేవారు నాటి ఆర్థిక మంత్రులు. ఈ సంప్రదాయాన్ని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా 1999-2000 బడ్జెట్లో తిరగరాశారు. ఫిబ్రవరి చివరి రోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పించడం ప్రారంభించారు. 2017లో తొలిసారి ఫిబ్రవరి తొలి రోజే నాటి ఆర్థిక మంత్రి అరుణ్జైట్ఈ బడ్జెట్ సమర్పించారు. దీంతో పూర్తిగా బ్రిటిష్ వలస వాద సంప్రదాయాలకు స్వస్తి పలికినట్లయింది.
1955 వరకు యూనియన్ బడ్జెట్ ఇంగ్లిష్లోనే ఉండేది. కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంగ్లిష్తోపాటు హిందీలోనూ బడ్జెట్ ప్రతులు ముద్రించాలని నిర్ణయించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కరోనా నేపథ్యంలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తొలి పేపర్లెస్ బడ్జెట్ సమర్పించారు. స్వతంత్ర భారతావనిలో ఇది తొలి పేపర్లెస్ బడ్జెట్
పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ స్వాతంత్య్ర భారతావని చరిత్రలో తొలి మహిళ. అయితే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రి హోదాలో 1970-71 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించారు. 2019-20 నుంచి నిర్మలా సీతారామన్ సంప్రదాయ బడ్జెట్ బ్రీఫ్కేస్కు తిలోదకాలిచ్చారు. మూడు సింహాల జాతీయ చిహ్నం ముద్రించిన ఎర్రని వస్త్రంలో బడ్జెట్ ప్రతులను పార్లమెంట్కు తీసుకొచ్చారు.
బ్రిటిష్ ప్రభుత్వ హయాం నుంచి 2016-17 రైల్వేలకు, సాధారణ శాఖలకు వేర్వేరు బడ్జెట్లు ఉండేవి. కానీ 92 ఏండ్ల తర్వాత 2017-18లో యూనియన్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను విలీనం చేశారు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ ముద్రించేవారు. కానీ తర్వాత బడ్జెట్ లీక్ కావడంతో మింట్ రోడ్డుకు మార్చారు. 1980లో నార్త్బ్లాక్ (ఆర్థికశాఖ కార్యాలయం)లోనే ప్రభుత్వ ప్రెస్ ఏర్పాటు చేశారు.
1973-74లో ఇందిరాగాంధీ హయాంలో ఆర్థిక మంత్రిగా యశ్వంత్రావ్ బీ చవాన్ సమర్పించిన బడ్జెట్ను బ్లాక్ బడ్జెట్ అని పిలుస్తారు. ఆ ఏడాది ద్రవ్యలోటు రూ.550 కోట్లు వచ్చింది. ఆ టైంలో యావత్ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.
1986-87 ఆర్థిక సంవత్సరానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వీపీ సింగ్.. దేశంలో లైసెన్స్ రాజ్ వ్యవస్థ ధ్వంసానికి పునాదులేశారు. ఈ బడ్జెట్ను క్యారట్ అండ్ స్టిక్ బడ్జెట్ అని పిలుస్తారు. ఇందులో రివార్డులు, శిక్షలు ఉన్నాయి. వినియోగదారులపై టాక్స్ ప్రభావం తగ్గించడానికి మొడ్వాట్ (మోడీఫైడ్ వాల్యూ యాడెడ్ టాక్స్) ప్రవేశపెట్టారు. పన్ను ఎగవేతదారులు, స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటీర్లపై కొరడా ఝులిపించారు.
పీవీ నర్సింహారావు సర్కార్లో ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్.. లైసెన్స్ రాజ్కు స్వస్తి పలుకుతూ.. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందుకే ఈ బడ్జెట్ను ఎపోకల్ బడ్జెట్ ( Epochal Budget ) అని పిలుస్తారు. పీవీ హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే దశకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లో విశ్వాసం పెంచేందుకు కస్టమ్స్ డ్యూటీ 220 నుంచి 150 శాతానికి తగ్గించారు. తద్వారా ఎగుమతులకు ప్రోత్సాహం లభించింది.
రెవెన్యూ వసూళ్లు పెంచడానికి 1997-98లో నాటి ఆర్థిక మంత్రిగా పీ చిదంబరం లాఫర్ కర్వ్ సూత్రాన్ని వినియోగించారు. పన్ను రేట్లు తగ్గించారు. వ్యక్తుల ఆదాయంపై గరిష్ఠంగా 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించేశారు. బ్లాక్ మనీని వెలికి తీసేందుకు స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంతోపాటు పలు పన్ను సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కస్టమ్స్ డ్యూటీ వ్యవస్థను సరళతరం చేయడంతోపాటు దాన్ని 40 శాతానికి తగ్గించేయడంతో ఈ బడ్జెట్ను డ్రీమ్ బడ్జెట్ అని పిలుస్తారు.
భారత ఐటీ రంగంలో వృద్ధిరేటును ప్రోత్సహించడానికి 2000 బడ్జెట్లో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా రోడ్ మ్యాప్ ప్రకటించారు. సాఫ్ట్వేర్ ఎగుమతిదారులకు ఇన్సెంటివ్లు ప్రకటించారు. కంప్యూటర్, దాని అనుబంధ విడి భాగాలకు సంబంధించి 21 వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించేశారు. అందుకే దీన్ని మిలీనియం బడ్జెట్ అంటారు.
2002-03లో అప్పటి ఏబీ వాజపేయి సారధ్యంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా యశ్వంత్ సిన్హా ప్రవేశ పెట్టిన పన్ను ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నారు. ప్రత్యేకించి సేవా పన్ను, ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచేశారు. సాధారణ ప్రజల నుండి, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నారు. అందుకే దీన్ని రోల్ బ్యాక్ బడ్జెట్ అని పిలుస్తారు.
వన్స్ ఇన్ఏ సెంచరీ బడ్జెట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈ బడ్జెట్ సెంచరీలోనే ఏకైక బడ్జెట్ ( Once-in-a-Century Budget ) అని పేర్కొన్నారు. కరోనాతో యావద్దేశం అల్లాడుతున్న వేళ హెల్త్కేర్, మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులకు పెద్ద పీట వేస్తూ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. హెల్త్కేర్, ఇన్ఫ్రా రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించారు.