అహ్మదాబాద్లో పుట్టిపెరిగిన శాలిని ముప్పై రెండేండ్ల క్రితం వ్యాపార కుటుంబానికి చెందిన సురేశ్ను పెండ్లి చేసుకుంది. వారికి ఇద్దరు కూతుళ్లు. పదిహేనేండ్ల క్రితం సురేశ్ క్యాన్సర్తో మరణించాడు. ఆ తర్వాత శాలినిని అత్తింటివారు సరిగా చూడలేదు. ఓ నలభై లక్షలు చేతిలో పెట్టి వేరుగా జీవించమని బలవంతపెట్టారు. దాంతో శాలిని గృహహింస చట్టం కింద.. పరిహారం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కింది కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చినా అత్తింటి వాళ్లు పట్టించుకోలేదు. హైకోర్టుకు వెళ్లింది.
అక్కడ కూడా శాలిని తన స్వరాన్ని గట్టిగానే వినిపించింది. కుటుంబ ఉమ్మడి వ్యాపారంలో లాభాల నుంచి తన కుటుంబ పోషణకు నెలనెలా కొంత పరిహారం ఇప్పించాలని అభ్యర్థించింది. గుజరాత్ ఉన్నత న్యాయస్థానం ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. శాలినికి, ఆమె ఇద్దరు కూతుళ్లకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున.. నెలనెలా రూ. 30 వేలు ఇవ్వాలని హైకోర్టు సదరు ఉమ్మడి కుటుంబాన్ని ఆదేశించింది. చనిపోయిన వ్యక్తికి కుటుంబ వ్యాపారంలో దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన వాటా ఉందనీ స్పష్టం చేసింది. కాబట్టి, ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలకు కూడా.. తమపెదనాన్న కొడుకులతో సమానంగా ఆర్థిక హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.