Weather alerts | తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వానలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పుడే కాదు.. ఎప్పుడు వర్షాలు కురిసిన సరే.. వాతావరణ శాఖ పలు రకాల హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒక్కోసారి రెడ్ అలర్ట్ జారీ చేస్తే.. మరోసారి ఆరెంజ్ అలర్ట్ అని జారీ చేస్తుంది. ఇంతకీ ఈ హెచ్చరికలకు అర్థమేంటి? వీటిని వాతావరణ శాఖ ఎలా జారీ చేస్తుంది? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..
వర్షాలు ఎప్పుడు కురుస్తాయి? ఎంతమేర కురుస్తాయనే వాటిపై వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేయడం మనకు తెలిసిందే. మరి ఇది ఎప్పట్నుంచి మొదలైందో తెలుసా? క్రీస్తు పూర్వం 3000 ముందు నుంచే వర్షపాతంపై అంచనాలు వేయడం మొదలైంది. క్రీ.పూ. 3000 ఏండ్లకు ముందురాసిన చందోయా ఉపనిషత్తుల్లో వర్షాలు, రుతువుల గురించి పేర్కొన్నారు. కౌటటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలోనూ వర్షపాతాన్ని కొలిచే విధానాలను ప్రస్తావించారు. ఏడో శతాబ్దంలో కాళిదాసు రాసిన మేఘదూత్లోనూ రుతు పవనాల ఆగమనం, వర్షాల గురించి పేర్కొన్నారు. ఇప్పుడు మనం వింటున్న వర్షపాత అంచనాలకు 17వ శతాబ్దంలో పునాదులు పడ్డాయి. భారత్లోనూ అప్పుడే వాతావరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 1785లో కలకత్తాలో, 1796లో మద్రాసులో ఈస్టిండియా కంపెనీ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక భారత వాతావరణ శాఖ ( ఐఎండీ )ని 1875లో ఏర్పాటు చేసింది.
వర్షపాతానికి సంబంధించి ఐఎండీ ప్రధానంగా రెండు రకాల అంచనాలను విడుదల చేస్తుంది. వీటిలో మొదటిది దీర్ఘకాల అంచనాలు. దీని ప్రకారం ఒక ప్రాంతంలో ఒక కాలంలో వర్షపాత సగటు, ఉష్ణోగ్రత, తేమ ఏవిధంగా ఉంటాయనే వాటిని ముందుగానే అంచనా వేస్తారు. ఈ అంచనాలను లాంగ్రేంజ్ ఫోర్క్యాస్టింగ్ (ఎల్ఆర్ఎఫ్) అంటారు. ఇక రెండోది రోజువారీ అంచనాలు. దీర్ఘకాలిక అంచనాలతో పోలిస్తే ఇవి భిన్నంగా ఉంటాయి. ఒక నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సమయంలో ఎంత వర్షపాతం పడుతుందో ఈ విధానంలో తెలుసుకుంటారు. దీనికోసం థర్మో మీటర్, బారో మీటర్, రెయిన్ గేజ్ వంటి పరికరాలను ఐఎండీ వినియోగిస్తుంది.
సాధారణంగా పీడనం, ఉష్ణోగ్రతకు మధ్య సంబంధం ఉంటుంది. ఇవి రెండు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి. ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. అందుకే ఈ రెండింటిలో వచ్చే మార్పుల ఆధారంగా వాతావరణాన్ని అంచనా వేస్తారు. అందుకే నిర్దిష్ట ప్రాంతంలో పీడనం, ఉష్ణోగ్రత ఏవిధంగా ఉన్నాయనే అంశాలను బారోమీటర్, థర్మోమీటర్ సహాయంతో కొలుస్తారు. ఆ సమాచారాన్ని వాతావరణ శాఖ ప్రధాన కార్యాలయాలకు పంపిస్తారు. అక్కడ ఈ సమాచారాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొసీజర్, మోడల్ ఫోర్కాస్ట్ వంటి విధానాలను అనుసరించి విశ్లేషిస్తారు. దాని ఆధారంగా వాతావరణం ఎలా ఉండబోతోందనేది అంచనా వేస్తారు.
వాతావరణ కేంద్రాలు ఇచ్చే వర్షపాతం అంచనాల ఆధారంగా ఐఎండీ ప్రాంతీయ కార్యాలయాలు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. ఈ హెచ్చరికలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. అవేంటంటే.. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్.
మోస్తరు వర్షపాతం | 15.6 మి.మీ. నుంచి 64.4 మి.మీ. వరకు |
భారీ వర్షం | 64.5 మి.మీ. నుంచి 115.5 మి.మీ. వరకు |
అతి భారీ వర్షం | 115.6 మి.మీ. నుంచి 204.5 మి.మీ. వరకు |
కుంభవృష్టి | 204.5 మి.మీ. కంటే ఎక్కువ |
రెడ్ అలర్ట్
రానున్న 24 గంటల్లో కుంభవృష్టి వర్షాలు ఉన్నప్పుడు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే.. 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణ శాఖ ఈ హెచ్చరిక జారీ చేసిందంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. వరదలు వచ్చే పరిస్థితి ఉంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఇతరత్రా సహాయక చర్యల కోసం వీరు సిద్ధమవుతారు.
ఆరెంజ్ అలర్ట్
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉనప్పుడు వాతావరణ శాఖ ఈ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేస్తుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండటంతో పాటు.. సహాయక చర్యల కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించేందుకు ఈ హెచ్చరికను జారీ చేస్తారు.
ఎల్లో అలర్ట్
మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ను జారీచేస్తారు. పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలని సూచించేందుకు ఈ అలర్ట్ను జారీ చేస్తారు.
గ్రీన్ అలర్ట్
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు. ఈ సమయంలో దాదాపుగా ఎలాంటి నష్టం గానీ ప్రమాదం గానీ ఉండదు. దీంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి గ్రీన్ అలర్ట్ను హెచ్చరికగా పరిగణించాల్సిన అవసరం ఉండదు.
వాతావరణ శాఖ అంచనాలతో పాటు ఎంత వర్షపాతం నమోదైందనే విషయాలను కూడా ఐఎండీ వెల్లడిస్తుంది. ప్రధానంగా రెయిన్ గేజ్ సహాయంతో వర్షపాతాన్ని కొలుస్తారు. ఈ రెయిన్ గేజ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా 6 వేలకు పైగానే ఉన్నాయి. వర్షం నేరుగా కురిసే ప్రాంతాల్లో ఈ రెయిన్ గేజ్ను ఏర్పాటు చేస్తారు. రెయిన్ గేజ్ ఏర్పాటు చేసే పరిసరాల్లో ఎలంటి చెట్లు, ఇతర అడ్డంకులు లేకుండా చూసుకుంటారు. ఆ తర్వాత రెయిన్ గేజ్లో నమోదయ్యే రీడింగ్ ఆధారంగా అక్కడ ఎంత వర్షపాతం నమోదైందో వెల్లడిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Internet Apocalypse : ఇంటర్నెట్ యుగాంతం వచ్చేసినట్టేనా? దూసుకొస్తున్న భారీ సౌర తుఫానే కారణమా?
క్రెడిట్ కార్డుకు అప్లయి చేస్తే రిజెక్ట్ చేశారని.. 1.2 బిలియన్ డాలర్ల కంపెనీని స్థాపించాడు
wireless charging room | గాలితోనే మీ ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు.. ఎలా?
Honeymoon | భార్య స్విట్జర్లాండ్లో.. భర్త ఫ్రాన్స్లో.. రొమాంటిక్గా హనీమూన్.. ఎలాగో తెలుసా?
ప్రేమ కోసం రాజరికాన్ని, రాజభోగాలను వదిలేసిన యువరాజులు, యువరాణులు వీళ్లే..