Sushant Singh Rajput | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి అప్పుడే ఆరేళ్లు అయిపోయింది. 2020 జూన్ 14న ముంబై బాంద్రాలోని తన ఇంట్లోనే సుశాంత్ చివరి శ్వాస విడిచారు. అయితే ఆదివారం ఆయన 6వ వర్ధంతి సందర్భంగా.. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తమ్ముడు ఎలా చనిపోయాడనే విషయం కంటే, తను బతికినంత కాలం ఎంత గొప్పగా జీవించాడనే విషయాన్నే గుర్తుంచుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. మనసులో జాలి, కరుణ లేనప్పుడు ఎంత పెద్ద విజయం సాధించినా దానికి అర్థం లేదనే విషయాన్ని సుశాంత్ అందరికీ నేర్పించాడని ఆమె గుర్తు చేసుకున్నారు.
సమయం ఎంత వేగంగా గడిచిపోయినా.. కొందరి జ్ఞాపకాలు కాలంతో పాటు ఇంకా పెద్దవవుతూనే ఉంటాయని శ్వేత రాసుకొచ్చారు. భాయ్ (సుశాంత్) గురించి ఆలోచించినప్పుడు.. చిన్నపిల్లల లాంటి అతని అమాయకత్వం, నక్షత్రాలు, విశ్వం, మనుషుల ఆలోచనల గురించి తెలుసుకోవాలనే అతని ఆరాటమే నాకు గుర్తొస్తాయి. ఎలాంటి బేధాలు చూపించకుండా అందరికీ సమానంగా గౌరవం ఇచ్చే మనసు అతనిది. మనిషి మన కళ్ల ముందు లేకపోయినా, వారు చూపించిన ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఎవరైనా సరే కోపాన్ని వదిలేసి ప్రేమగా ఉన్నప్పుడు, అజ్ఞానాన్ని వీడి విషయాలు నేర్చుకుంటున్నప్పుడు భాయ్ ఆశయాలు బతికే ఉంటాయి. సుశాంత్కు మనం ఇచ్చే నిజమైన నివాళి బాధపడటం కాదు.. అతను నమ్మిన జిజ్ఞాస, దయ, భయం లేకుండా కలలు కనడం వంటి మంచి అలవాట్లను మన జీవితంలో అలవర్చుకోవడమే. మనం ఎంతకాలం బతికాం అనేదానికంటే, ఎంతమంది హృదయాల్లో నిలిచాం అనేదే ముఖ్యం. ఆ లెక్కన భాయ్ ఎప్పటికీ బతికే ఉంటాడు. నువ్వు ఎప్పటికీ కోట్లాది మందికి స్ఫూర్తివే భాయ్ అంటూ శ్వేత భావోద్వేగంగా తన పోస్ట్ను ముగించారు.