Ananth Sriram | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. కథ, భావోద్వేగాలు, రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కినా, సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై మాత్రం కొంత వివాదం నెలకొంది. ముఖ్యంగా ఆమె పాత్రను అవసరానికి మించి గ్లామరస్గా చూపించారని, కొన్ని సన్నివేశాల్లో పాత్రను సెక్సువలైజ్ చేశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సాన గతంలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే క్షమాపణలు కోరుతున్నానని ట్వీట్ చేశారు. అయితే తాజాగా నిర్వహించిన ‘పెద్ది’ సక్సెస్ ప్రెస్మీట్లో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ బుచ్చిబాబు క్షమాపణ చెప్పడం తనకు నచ్చలేదని స్పష్టం చేశారు. ఒక పాత్ర ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనేది పూర్తిగా దర్శకుడి ఊహాశక్తి, కథకు సంబంధించిన అంశమని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు చెప్పే అభిప్రాయాలే అంతిమ సత్యాలుగా మారిపోతున్నాయి. ఒక దర్శకుడు పాత్రను తన దృష్టికోణంలో ఎలా మలచాలనుకుంటాడో ఆ స్వేచ్ఛ లేకపోతే సృజనాత్మకతకు పెద్ద నష్టం జరుగుతుంది అని వ్యాఖ్యానించారు. అలాగే సినిమాల్లో ఇంగ్లీష్ పదజాలం లేదా ఆధునిక భావజాలంతో కూడిన సంభాషణలు వస్తే వాటిని కళాత్మకంగా స్వీకరించే కొందరు, గ్రామీణ నేపథ్యంలోని పాత్రలు తమ సహజ భాషలో మాట్లాడితే మాత్రం వల్గారిటీగా చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.
అనంత శ్రీరామ్ తన వ్యాఖ్యల్లో మరింత ఘాటుగా స్పందించారు. ప్రతి పాత్రను ఒకే కోణంలో చూడడం సరైంది కాదు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పాత్ర తన స్వభావానికి తగ్గట్టుగా మాట్లాడితే దానిని ఆబ్జెక్టిఫికేషన్గా చూడటం సరికాదు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో డాక్యుమెంటరీలు తప్ప కమర్షియల్ సినిమాలు చేయడం కష్టమవుతుంది అని అన్నారు. అలాగే ఇటీవల థియేటర్లలో ప్రేక్షకులను కలిసిన సమయంలో చాలామంది మహిళలు కూడా బుచ్చిబాబును కలిసి “మీరు ఎందుకు సారీ చెప్పారు? మాకు ఆ పాత్రలో ఎలాంటి అభ్యంతరం అనిపించలేదు” అని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.