తను పట్టే రకరకాల చేపల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉండే ఒక జాలరి.. తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్లో ఫెర్ట్సోవ్ అనే పేరుతో ఉన్న ఈ జాలరిని 6.5 లక్షల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా అతను రెండు ఫొటోలు షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో ఉన్న చేపలు సముద్రం లోతుల్లో ఉంటాయి. వాటిని పట్టుకొచ్చి ఫొటోలు తీశాడా జాలరి.
ఒక ఫొటోలో పారదర్శకంగా ఉన్న చేపను కలిపి కుట్టేశాడతను. దీని ఫొటోను షేర్ చేస్తూ ఫ్రాంకెన్స్టెయిన్స్ ఫిష్ అని పోస్టు చేశాడు. అది చూసిన యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ అయితే.. ‘‘ఇది రాట్ఫిష్లా ఉందని మా అబ్బాయి చెప్పాడు. ఇవి షార్కుల్లా కార్టిలేజినస్ చేపలట’’ అని చెప్పాడు. ఈ చేపలు సముద్రంలో 650 అడుగుల నుంచి 8,530 అడుగుల లోతున జీవిస్తాయి. అలాగే ఎక్కువ లోతులో ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునేలా వీటి శరీరాలు ఉంటాయి.
ఇక రెండో ఫొటోలో అయితే.. చేప నోటిలో నుంచి దాని పొట్టలో ఉండే పేగులు అన్నీ బయటకు వచ్చి కనబడుతున్నాయి. దాన్ని చూసిన నెటిజన్లు కూడా ఆ చేప అలా ఎందుకు ఉందో వివరించారు. ‘‘ఆ చేప కళ్లు ఉబ్బి ఉండటం, దాని నోటిలో నుంచి అలా పేగులు రావడం చూస్తుంటే.. అది బారోట్రామాకు గురైనట్లు ఉంది. డైవర్లు దాన్ని ‘ది బెండ్స్’ అంటారు.
సముద్రంలో అడుగున ఉండే చేపలను పైకి తీసుకొచ్చే సమయంలో ఒత్తిడి మారడం వల్ల చేపల పొట్టలోని భాగాలన్నీ ఇలా బయటకు వచ్చేస్తాయి. చాలా సందర్భాల్లో చేప మాత్రం బతికే ఉంటుంది’’ అని వివరించారు. చాలామంది నెటిజన్లు ఈ ఫొటోలు చూసి భయపడిపోయినట్లు వారి కామెంట్లు చూస్తే తెలుస్తోంది.