ఆంగ్లేయులు మనల్ని బానిసలుగా చేసుకుని పాలించారని మన అందరికీ తెలుసు ! కానీ మన ఆడబిడ్డ బ్రిటీష్ రాజకుటుంబంలోకి ప్రిన్సెస్గా వెళ్లిందని తెలుసా ! నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది మాత్రం అక్షర సత్యం. భారతదేశాన్ని ఈస్టిండియా కంపెనీ తన గుప్పిట్లోకి తీసుకున్న సమయంలోనే ఆమె బకింగ్హామ్ ప్యాలెస్లోకి అడుగుపెట్టింది. ఏకంగా క్వీన్ విక్టోరియాకే మానస పుత్రికగా మారింది. ఆమే కూర్గ్ యువరాణి గౌరమ్మ. చరిత్రలో మరుగునపడిన ఆమె జీవితం గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం..
1830వ కాలంలో కర్ణాటకలోని కొడగు ( కూర్గ్ ) ప్రాంతాన్ని చిక్క వీరరాజేంద్ర అనే రాజు పాలించేవాడు. కానీ 1834 ఏప్రిల్ 24న జరిగిన యుద్ధంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చేతిలో ఆయన ఓడిపోయాడు. దీంతో ఆయను రాజకీయ బందీగా చేసుకుని బనారస్ (వారణాసి) తీసుకెళ్లారు. వీరరాజేంద్ర 14 ఏండ్ల పాటు అక్కేడే ఉన్నాడు. ఆ సమయంలోనే వీర రాజేంద్ర సతీమణి 1841 ఫిబ్రవరిలో ఒక పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె కన్నుమూసింది. అప్పటి నుంచి తన కూతురు గౌరమ్మను వీరరాజేంద్ర అల్లారుముద్దుగా చూసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈస్టిండియా కంపెనీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వాలని బ్రిటీష్ ప్రభుత్వాన్ని కోరాలని అనుకున్నాడు. అలాగే తన కూతురికి బంగారు భవిష్యత్తు కల్పించాలని క్వీన్ విక్టోరియాను అడిగేందుకు 1852లో ఇంగ్లండ్ బయల్దేరి వెళ్లాడు.
తన పదకొండేళ్ల కూతురితో ఇంగ్లండ్ వెళ్లిన చిక్క వీరరాజేంద్రకు బకింగ్హామ్ ప్యాలెస్లో సాదరస్వాగతం లభించింది. క్వీన్ విక్టోరియా స్వయంగా వారికి అతిథి మర్యాదల్లో లోటుపాట్లు లేకుండా చూసుకుంది. వీరరాజేంద్ర కుమార్తె గౌరమ్మను చూడగానే క్వీన్ విక్టోరియాకు తెగ నచ్చేసింది. ఆమె సౌందర్యం, చురుకుదనం చూసి ముచ్చటపడింది. దీంతో ఆమె సంరక్షణ బాధ్యతలు తీసుకునేందుకు అంగీకరించింది. గౌరమ్మకు బాప్టిజం ఇప్పించింది. అలాగే ఆమెకు దేవుడిచ్చిన తల్లిగా ఉంటానని ప్రకటించింది. అంతేకాదు తన పేరును కూడా గౌరమ్మకు ఇస్తూ.. ప్రిన్సెస్ విక్టోరియా గౌరమ్మగా నామకరణం చేసింది. ఆమెను తన సొంత కూతురిలాగే చూసుకుంది. అయితే ఆమెకు విద్యాభ్యాసం, పాశ్చాత్య నాగరికతను నేర్పించేందుకు మేజర్ డ్రమ్మండ్ దంపతులను సంరక్షులిగా నియమించింది.
1852లో విక్టోరియా గౌరమ్మకు వివాహం చేయాలని క్వీన్ విక్టోరియా నియమించింది. అప్పటికి గౌరమ్మ వయసు పదిహేనేండ్లు. గౌరమ్మకు తగిన వరుడిని చూసే బాధ్యతను లేడీ లాగిన్కు అప్పగించింది. దీంతో రాజ్యాన్ని కోల్పోయి యూకేకు వలస వచ్చిన సిక్కు యువరాజు దులిప్ సింగ్ సంబంధాన్ని క్వీన్ ముందుకు తీసుకెళ్లింది లేడీ లాగిన్. కానీ గౌరమ్మ, దులిప్ సింగ్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడలేదు. యూకేకు చెందిన యువతినే తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని దులిప్ సింగ్ ఆశపడ్డాడు. దీంతో నిరాశ చెందిన రాజకుటుంబం మరో సంబంధం కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తనకంటే 35 ఏండ్లు పెద్దవాడైన లెఫ్టినెంట్ కల్నల్ జాన్ కాంప్బెల్ను ఇష్టపడి పెళ్లాడింది.
వాస్తవానికి బకింగ్హామ్ ప్యాలెస్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి గౌరమ్మ సంతోషంగా లేదనే చెప్పొచ్చు. క్వీన్ విక్టోరియా తనను దేవుడిచ్చిన కుమార్తెగా స్వీకరించినప్పటికీ.. ఆమె శరీర రంగు కారణంగా రాజ కుటుంబంలో ఎక్కువగా కలవలేకపోయేది. బయటి వ్యక్తిలాగే జీవించేది. అది కాకుండా తన కన్నతండ్రిని కలిసేందుకు కూడా క్వీన్ విక్టోరియా ఒప్పుకునేది కాదు. ఒకవేళ వీరరాజేంద్రను గౌరమ్మ కలిస్తే.. ఆమె మనసు చెడగొడతాడని క్వీన్ విక్టోరియా భయపడేది. అందుకే కన్న తండ్రిని కలిసేందుకు కూడా ఆంక్షలు ఉండేవి. దీంతో బ్రిటిష్ రాజకుటుంబంలో ఇమడలేకపోయింది. రాజ కుటుంబంలోని నడవడికలు ఆమెకు అడ్డుగోడలుగా కనిపించేవి. దీంతో పెళ్లి తర్వాత అయిన జీవితం బాగుంటుందేమో అనుకుంటే ఆ కలలు కూడా కల్లలైపోయాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్న కల్నల్ కాంప్బెల్ గౌరమ్మ కంటే కూడా ఆమె ఆస్తినే ఎక్కువగా ఇష్టపడేవాడు. ఆ డబ్బుతో జూదం ఆడుతూ జల్సాలు చేసేవాడు. దీంతో గౌరమ్మను పట్టించుకునే నాథులే కరవయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించింది. ఈ క్రమంలోనే 1861లో ఒక కుమార్తెకు గౌరమ్మ జన్మనిచ్చింది. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డ గౌరమ్మ చివరకు 1864లో టీబీతో బాధపడుతూ కన్నుమూసింది. 23 ఏండ్లకే గౌరమ్మ మరణించడాన్ని క్వీన్ విక్టోరియా తట్టుకోలేకపోయింది. విక్టోరియా గౌరమ్మ మరణం తనని ఎంతో బాధించిందని పలు సందర్భాల్లో చెప్పింది. ఇక క్వీన్ విక్టోరియా తర్వాత.. గౌరమ్మ జీవితం చరిత్రలోనూ మరుగునపడిపోయింది.
విక్టోరియా గౌరమ్మ జీవితంపై విక్టోరియా గౌరమ్మ ది లాస్ట్ ప్రిన్సెస్ ఆఫ్ కూర్గ్ పేరుతో ఒక పుస్తకం కూడా వచ్చింది. దీన్ని సీపీ బెల్లియప్ప రచించాడు. గౌరమ్మ తన తండ్రితో కలిసి వారణాసి నుంచి ఇంగ్లండ్ వెళ్లడం నుంచి తన జీవితం విషాదాంతం అయ్యే వరకు ప్రతి విషయాన్ని ఇందులో తెలియజేశాడు. అంతేకాదు గౌరమ్మ వారసుల గురించి కూడా బెల్లియప్ప ఆన్వేషించాడు. ఈక్రమంలో కాంపాబెల్ మొదటి భార్య కుమారుడు అన్నీ ఫిలిప్స్ను ఆయన కలిశారు. ప్రిన్సెస్ గౌరమ్మ తన కుమార్తె ఎడిత్తో కలిసి ఉన్న ఫొటోను సంపాదించాడు. ప్రస్తుతం గౌరమ్మ మునిమనమడు రాబర్ట్ యార్డ్లీ ఆస్ట్రేలియాలో తన కుటుంబంతో జీవిస్తున్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా.. అపర కుబేరులు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
Pet Passport : శునకాలకూ పాస్పోర్టు ఉంటుందని తెలుసా !
కూలి పనులు మాని యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్నాడు..
పేదలకు అండగా.. ఒక్కడే 100 ఇండ్లు కట్టించి ఇచ్చాడు