Loni air pollution : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు, దేశాలకు సంబంధించిన జాబితా ఒకటి తాజాగా విడుదలైంది. గత ఏడాది అంచనాల ప్రకారం ప్రపచంలోనే అత్యంత వాయు కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. ఇక ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా ఇండియాలోని చిన్న పట్టణమైన లోని నిలిచింది. ఇది ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్కు దగ్గర్లో ఉంటుంది. ఐక్యూఎయిర్ అనే స్విట్జర్లాండ్కు చెందిన సంస్థ 2025లో అత్యంత వాయు కాలుష్య దేశాలు, నగరాలకు సంబంధించి నివేదిక రూపొందించింది. ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది.
దీని ప్రకారం మొత్తం 143 దేశాల్లో వాయు కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 130 దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయు కాలుష్య ప్రమాణాల్లో విఫలమయ్యాయి. లోని నగరంలో పీఎం 2.5కి వాయు కాలుష్యం 112.5 మైక్రో గ్రామ్స్గా ఉంది. పీఎం 2.5 అంటే 2.5 మైక్రోమీటర్లకంటే తక్కువగా ఉన్న కాలుష్య రేణువులు అని అర్థం. ఇంత తక్కువగా ఉంటే అవి ముక్కు, శ్వాస ద్వారా లంగ్స్లోకి, రక్తంలోకి చొచ్చుకుపోగలవు. దీంతో ఆస్తమా, గుండె జబ్బులు వంటి అనారోగ్యాలు దరిచేరే అవకాశం ఉంది. లోని నగరం నేషనల్ క్యాపిటల్ రీజన్ (ఎన్సీఆర్) పరిధిలో ఉంది. చుట్టుపక్కల పరిశ్రమలు ఉండటం, వాహన కాలుష్యం కారణంగా ఇక్కడ పొల్యూషన్ పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం కలిగిన దేశంగా పాకిస్తాన్ నిలిచింది. ఇక్కడ సాధారణ వాయు ప్రమాణాలకంటే 13 రెట్లు ఎక్కువ కాలుష్యం ఉంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న రెండో దేశంగా పాకిస్తాన్, మూడో దేశంగా తజికిస్తాన్ ఉన్నాయి.
మొత్తం 75 దేశాల్లో కాలుష్య స్థాయిలు తగ్గగా, 54 దేశాల్లో పెరిగాయి. 2024లో ప్రపంచంలోని నగరాల్లో 17 శాతం మాత్రమే వాయు ప్రమాణాలను అందుకోగా, 2025లో ఈ సంఖ్య 14 శాతానికి తగ్గింది. ఇక ప్రపంచంలో ఎక్కువ కాలుష్యం ఉన్న టాప్ 25 నగరాలు అన్నీ ఇండియా, పాకిస్తాన్, చైనాల్లోనే ఉన్నాయి. అత్యంత కాలుష్యం కలిగిన రెండో నగరంగా చైనాలోని హోటాన్ నిలిచింది. ఇక్కడ 109.6 మైక్రోగ్రాముల కాలుష్యం ఉంది. ఈ జాబితాలో 14 శాతం నగరాలు మాత్రమే వాయు కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. మిగతా అన్ని నగరాల్లో కాలుష్యం ఎక్కువగానే ఉంది. కాలుష్యం లేని నగరాల్లో ఆస్ట్రేలియా, ఐస్ల్యాండ్, ఎస్టోనియా, పనామా వంటి నగరాలున్నాయి.