పట్నా : బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో నవవధువును తన భుజంపై ఎక్కించుకుని పెండ్లికొడుకు నదిని దాటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దిఘాబ్యాంక్ బ్లాక్లోని సింద్మరి ఘాట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కంకై నది పోటెత్తడంతో ఈ ప్రాంతంలో వరద నీరు చేరింది. నదికి ఆవలవైపు ఉన్న పల్సా గ్రామం నుంచి వివాహానంతరం పెండ్లికొడుకు శివకుమార్ సింగ్, వధువుతో పాటు బంధువులతో కలిసి పడవలో బయలుదేరాడు.
కొద్ది దూరం ప్రయాణించిన అనంతరం పడవ ఇసుకలో చిక్కుకుపోయింది. దీంతో పడవ నుంచి నది ఒడ్డుకు చేరేందుకు మరో మార్గం లేకపోవడంతో తన భార్యను భుజాలపైకి ఎక్కించుకుని ప్రయాణించాలని నిర్ణయించానని శివకుమార్ చెప్పుకొచ్చాడు. వరదలతో పలు గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ తెగిపోవడంతో పడవలే తమకు ప్రయాణానికి దిక్కవుతున్నాయని పెండ్లి కుమారుడి బంధువు రాహుల్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి చోట ఇదే దుస్థితి నెలకొందని సింగ్ చెప్పారు.