ఏదైనా వస్తువు కొనేముందు ప్రతి ఒక్కరూ ఆ వస్తువు బాగుందా? లేదా? అని ఆరా తీస్తారు. ఈ కాలంలో అన్లైన్లో షాపింగ్ చేసే వాళ్లు ఎక్కువ కావడంతో వినియోగదారులు ఆ వస్తువుకు లభించిన రేటింగ్, సమీక్షల గురించి పరిశీలిస్తుంటారు.
ఇది పసిగట్టిన ఈ కమర్స్ కంపెనీలు వినయోగదారులచేత తాము విక్రయించే ఉత్పత్తులకు రేటింగ్లు, రివ్యూలు రాయమని ఒత్తిడి చేస్తున్నారు. దేశంలోని రెండు అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్లో చాలా మంది విక్రేతలు తమ ఉత్పత్తికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలని కొనుగోలుదారులపై ఒత్తిడి చేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారుడు విశ్వాస్ షా Amazon నుంచి వెయిట్ మెషీన్ను కొనుగోలు చేశాడు. అయితే ఆ వెయిట్ మెషీన్కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలని విక్రేత విశ్వాస్కు కాల్ చేశాడు. అలా చేయకపోతే ఆ వస్తువుపై గల వారంటీని ఇవ్వమని . రేటింగ్ ఇస్తేనే వారంటీ వివరాలు మెయిల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు.
అలాగే.. సూరత్కు చెందిన ఒక వినియోగదారుడు ఫ్లిప్కార్ట్ నుంచి షాపింగ్ చేశాడు. ఆయనను కూడా ఒక విక్రేత తన ఉత్పత్తులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన తర్వాతనే ఆయా వస్తువులకు 6 నెలల అదనపు వారంటీ ఇస్తామని చెప్పినట్లు ఆయన తెలిపాడు. భారీ రేటింగ్లతో ఉత్పత్తుల విక్రయాలు బాగా పెంచుకోవడానకే ఇలా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డాడు.
వినియోగదారుల హక్కుల సంస్థ ‘కన్స్యూమర్ వాయిస్’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అసిమ్ సన్యాల్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన పలు దేశాలలో నకిలీ సమీక్షలను, రేటింగ్లను అరికట్టేందుకు చట్టాలు ఉన్నాయని, భారతదేశంలో అటువంటి చట్టాలు లేవన్నారు. దీనిని అనువుగా చేసుకుని ఈ-కామర్స్ కంపెనీల ద్వారా వస్తువులను విక్రయించేవారు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ఆ ఆరోపణలపై స్పందించిన అమెజాన్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ‘నకిలీ సమీక్షలు, రేటింగ్లను గుర్తించి, వాటిని నిరోధించడానికి తమ బృందం పని చేస్తోందని తెలిపారు.