గత కొన్ని రోజుల నుంచి ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత ఆటగాళ్ల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ఆటగాడు.. గోల్డ్ మెడల్ సాధించాడు.. ఈ ఆటగాడు.. సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అని సంబురపడిపోతున్నాం. పతకం గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన ఆ ఆటగాళ్లకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. కానీ.. ఆ తర్వాత ఆ ప్లేయర్లను జీవితాంతం గుర్తుంచుకుంటున్నామా? రెండుమూడు రోజుల హడావుడేనా? లేక కొందరికే ప్రాధాన్యత ఇస్తూ.. మిగితా వారిని పక్కన పెడుతున్నారా? అనే ప్రశ ఉత్పత్నమవుతుంది.. ఈ ప్లేయర్ గురించి తెలుసుకుంటే.
ఆయన క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ టీమ్లో సభ్యుడు. కానీ.. ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటూ తన ఫ్యామిలీని పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. 2018లో జరిగిన బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్లో నరేశ్ తుమ్డా అనే యువకుడు ఇండియా తరుపున జట్టులో ఆడాడు. ఆ వరల్డ్ కప్లో ఇండియా.. పాకిస్థాన్ను ఓడించి.. కప్పు కైవసం చేసుకుంది. కానీ… ఇప్పుడు ఆ అంధ ప్లేయర్.. తన సొంత రాష్ట్రం గుజరాత్లోని నవ్సారీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. తన కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్మడం, కూలీ పనులకు పోవడం తప్పడం లేదట నరేశ్కు.
నేను ప్రతిరోజు 250 రూపాయలు సంపాదిస్తున్నా. కూలీ పని చేస్తేనే మూడు పూటలా తిండి.. లేదంటే పస్తులు ఉండటమే. మాది కడు పేదరికం. కూలీనాలీ చేస్తేగానీ పూట గడవదు. ఇప్పటికి చాలాసార్లు ముఖ్యమంత్రిని అభ్యర్థించా. నాకు ఉద్యోగం ఇప్పించండి.. అని కోరా. కానీ.. ఎటువంటి రిప్లయి రాలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో కూలీ పని చేయాల్సి వస్తోంది.. అని నరేశ్ వాపోయాడు.
నరేశ్.. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 2014లో గుజరాత్ టీమ్లో నరేశ్ సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత నేషనల్ టీమ్లో చోటు దక్కించుకున్నాడు. 2018లో జరిగిన బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్లో.. పాకిస్థాన్ టార్గెట్ 308ని రెండు వికెట్ల తేడాతో చేజ్ చేసి భారత్కు కప్ అందించారు.