న్యూఢిల్లీ : దేశీ వివాహాలంటే ఎన్నో వేడుకలు, అతిధుల సందళ్లు, బారాత్లతో హోరెత్తుతాయి. పెండ్లి మంటపానికి పెండ్లికొడుకు గుర్రంపై ఊరేగుతుంటే మహిళలు, యువత డ్యాన్స్లతో అదరగొడుతుంటారు. అయితే ఈరోజుల్లో పెండ్లికొడుకులు కార్లలోనే కూర్చుని పెండ్లి వేదికకు చేరుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. మరి మారిన పరిస్ధితుల్లో ఓ పెండ్లికొడుకు పెండ్లి మంటపానికి ఓ వ్యక్తి భుజంపై ఊరేగుతూ వచ్చాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. స్నేహితుడి భుజంపై పెండ్లికొడుకు మంటపానికి వస్తుండగా ఆ ప్రాంతానికి చెందిన చిన్నారులు, యువకులు డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈ వైరల్ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారనే వివరాలు వెల్లడికాలేదు. సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియోను ఇప్పటివరకూ 17,000 మందికి పైగా నెటిజన్లు వీక్షించారు.