హైదరాబాద్ : మంత్రి కేటీర్తో ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీ లో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంపై ఎన్నారైల భాగస్వామ్యం గురించి చర్చించారు.
ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ..తెలుగు మీడియంలో చదువుకొనే విద్యార్థులు తగినంత స్థాయిలో అవకాశాలను అందుకోలేక పోతున్నారు.
అందుకోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సంబంధించి ప్రత్యేకంగా చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్నదని తెలిపారు. ఈ చట్టంతో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి.
దీని వల్ల తెలంగాణ బిడ్డలు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా చదవుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములం అవుతున్నామని తెలిపారు.
త్వరలోనే ఎన్నారైలతో కలిసి ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసి ఎన్నారైలను వారి సొంత గ్రామంలో భాగస్వాములయ్యేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిని ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తామన్నారు.
అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్కు ఎన్నారైల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.