అమెరికా : కీబోర్డ్, గిటార్, ఫ్లూట్ వంటి 26 వాయిద్యాలు అలవోకగా వాయించడంలో నిపుణుడిగా వివిధ దేశాలలో శ్రోతలకు తెలుగుపాట మాధుర్యాన్ని చవిచూపిన విశిష్ట అంతర్జాతీయ గాయకుడు వినోద్బాబు అని పలువురు వక్తలు ప్రశంసించారు. న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ యుటిలిటీ అంతర్జాలంలో వినోద్బాబుకు జరిగిన సత్కార కార్యక్రమంలో ఆయన గాన మాధుర్యాన్ని వేనోళ్ల పొగిడారు.
వంశీ గ్లోబల్ అవార్డ్స్ – ఇండియా వంశీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. వంశీ రామరాజు అధ్యక్షతన జరిగిన వినోద్బాబు సత్కారకార్యక్రమాన్ని వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధ, మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి, వ్యాఖ్యాత్రి సుధామయి కన్నుల పండువుగా నిర్వహించారు.
అంతర్జాలంలో జరిగిన ఈ కార్యక్రమంలో వినోద్బాబును అతని మాతృమూర్తి జ్ఞానకుమారి, అర్ధాంగి గాయత్రి, కుమార్తెలు శ్రావణి, భావన వారి స్వగృహంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి శారద ఆకునూరి, తోటకూర ప్రసాద్ (తానా పూర్వ అధ్యక్షులు), గురు రామాచారి, గాయని అనూరాధ, రేవతీ శ్రీనివాస్, సుజారమణ, హేమమాలిని, సీతారామయ్య, నేపథ్యగాయకులు వేణు శ్రీరంగం, నేపథ్యగాయకులు ప్రవీణ్ కొప్పుల, గాయనీమణులు దివాకర్ల సురేఖామూర్తి, విజయలక్ష్మి, గౌరీ పార్వతీదేవి బొమ్మన (ఖతార్), అర్చన వెంకటేశ్వరరావు, అపర ఘంటసాల బాలకామేశ్వరరావు, కమలాశాస్త్రి, ఎస్విబి ఛానల్ నుంచి రామలక్ష్మి, కువాయత్ నుంచి అన్నదానం మురళీమనోహర్, శశిరాణి, శివశంకర్, మోహన్ తదితరులు పాల్గొని వినోద్బాబును అజాతశత్రువు అన్నారు.
అమెరికాలో జరిగిన ఘంటసాల ఆరాధనోత్సవాలలో పలుమార్లు పాల్గొని అనాథలు, దివ్యాంగులు, పేద, వృద్ధ కళాకారుల సహాయార్థం అనేక కార్యక్రమాలు లాభాపేక్ష లేకుండా నిర్వహించారని ప్రస్తుతించారు. ఈ సందర్భంగా వినోద్బాబు మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ రైల్వేశాఖలో పనిచేస్తున్నాని, మానవసేవే మాధవ సేవగా భావించి అందరికీ చేయూతనివ్వడమే తన ధ్యేయమని అన్నారు.