Ashtavadhanam | కెనడాలో త్రిభాషా మహాసస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ 1250వ అష్టావధానం ఘనంగా జరిగింది. తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గాదేవి ఆలయంలో జరిగింది. అటు చమత్కారాలు, ఇటు చెమకులతో ఆద్యాంతం సభికులను నవ్వుల జల్లుల్లో ముంచెత్తింది. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం తమ అదృష్టమంటూ యువత హర్షం వ్యక్తం చేశారు.
గత రెండు నెలలుగా వద్ధిపర్తి పద్మాకర్ అమెరికా, కెనడా దేశాల్లో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో ప్రవచనాలు, అష్టావధానం, శతావధానం నిర్వహించి, కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుత ప్రసంగం తదితర అంశాలతో సభను మరింత రక్తికట్టించారు. ఈ సందర్భంగా తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా సంస్థలను ఆయన ప్రశంసించారు. అత్యంత వైభవంగా సాగిన సాహితీ సదస్సు తెలుగు భాషా ప్రియులకు కనుల పండువ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు లక్ష్మీ రాయవరపు మాట్లాడుతూ తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పినట్లు తెలిపారు.
తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదిక అన్నారు. తెలుగువాహిని అధ్యక్షుడు శ్రీ త్రివిక్రం సింగరాజు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద చదవడం నుంచి సభ్యుల్లో భావుకత పెంచే నేటితరం వచన కవితలను రాయించే దాకా పూచీ తెలుగువాహినిదన్నారు. ఓంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యుడు మురళి పగిడేల మాట్లాడుతూ ఓంటారియోలో ఉంటున్న తెలుగువారికి కావాల్సిన సహాయం చేసి, సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడడమే ఓటీఎఫ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.