H-1 B Visa | తెలుగు రాష్ట్రాల్లో బీటెక్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి.. అమెరికాలో హెచ్-1 బీ వీసా దొరికితే ఆనందంగా అంది పుచ్చుకుంటారు. టెక్నాలజీ రంగాల్లో ప్రతిభావంతులైన నిపుణుల కోసం ప్రతియేటా భారత్, చైనా వంటి దేశాల వారికి హెచ్-1 బీ వీసాలు జారీ చేస్తుంది అమెరికా. కానీ, ఈ ఏడాది కంప్యూటర్ జనరేటెడ్ లాటరీలో హెచ్-1 బీ వీసా కోసం ఏకంగా 7,80,884 దరఖాస్తులు వచ్చాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రతిష్ఠాత్మకం హెచ్-1 బీ వీసాలు. కంప్యూటరైజ్డ్ లాటరీలో వీటిని ఎంపిక చేస్తారు. వీటిని ఎక్కువగా దక్కించుకోవడానికి కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాలు దక్కించుకోవడానికి ఒకే దరఖాస్తు దారు పేరిట పలు రిజిస్ట్రేషన్లు కంప్యూటరైజ్డ్ లాటరీలో నమోదు చేస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) (United States Citizenship and Immigration Services) గుర్తించింది. 2023కు నమోదైన రిజిస్ట్రేషన్లతో పోలిస్తే 2024లో పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు తెలిపింది. 2021లో 2,74,237 మంది, 2022లో 301447 మంది, 2023లో 4,83,927 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2023తో పోలిస్తే తాజాగా 2024 కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు రెట్టింపు.
మామూలుగానైతే రెండు సందర్భాల్లో మాత్రమే హెచ్-1 బీ వీసాల కోసం దరఖాస్తులు పెరుగుతుంటాయి. ఒకే లబ్ధిదారు ఒకటి కంటే ఎక్కువ సార్లు తమ పేరు రిజిస్టర్ చేసుకున్నా, ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నా.. రిజిస్టర్డ్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. గతేడాది 1,65,180 మంది ఒకటి కంటే ఎక్కువసార్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే ఈ ఏడాది అలా ఎక్కువ సార్లు లాటరీలో పేర్లు నమోదు చేసుకున్న వారు 4,08,891 మంది అని గుర్తించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది.
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వీసాలు రావాలన్న దురుద్దేశంతోనే ఇలా ఎక్కువ సంఖ్యలో వీసా దరఖాస్తులు రిజిస్టర్ చేయిస్తున్నాయని యూఎస్సీఐఎస్ పేర్కొంది. దీనిపై దర్యాప్తు మొదలు పెట్టామని, తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
మోసపూరితంగా ఒక్క నిపుణుడితోనే ఒకటి కంటే ఎక్కువ సార్లు రిజిస్ట్రేషన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆధునీకరణకు ప్లాన్ చేస్తున్నామని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. తమ వలస వ్యవస్థకు, ఆర్థిక వ్యవస్థకు హెచ్-1బీ వీసా చాలా ముఖ్యమైందని, ఇందులో మోసాలు, దుర్వనియోగాన్ని తగ్గించడానికి రిజిస్ట్రేషన్ విధానం మరింత పటిష్ట పరుస్తాం అని పేర్కొంది.