Tyagaraja Aradhana | స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ (Music academy) ఆధ్వర్యంలో ఈ నెల 18న శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు రామకృష్ణ మిషన్ శారదాహాల్లో ఘనంగా నిర్వహించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపకురాలు యడవల్లి శేషుకుమారి తెలుగు వారందరితో మొట్ట మొదటిసారి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరపాలని దృఢసంకల్పంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని అందరి ముందుకు తీసుకురావటం కొనియాడదగ్గ విషయం.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా యడవల్లి శేషుకుమారి సంగీత గురువు గౌరీ గోకుల్, రామకృష్ణా మిషన్ స్వామీజీ గౌరవ అతిధిగా హాజరు కావటం విశేషం. ఇంకా `TAS (మనం తెలుగు) అసోసియేషన్`, `శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్`, STS ఎక్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి తదితరులు హాజరయ్యారు. స్వరలయ ఆర్ట్స్ సంస్థకు హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గుర్తింపు లభించింది. సద్గురు త్యాగరాజస్వామి కృప వల్లే ఈ గుర్తింపు లభించిందని నిర్వాహకులు తెలిపారు. తమ గురువుల సమక్షంలో యూనివర్సిటీ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని యడవల్లి శేషుకుమారి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో యడవల్లి శేషు కుమారి, సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, కిరీటి దేశిరాజు, కుమారి యడవల్లి శ్రీ విద్య, యడవల్లి శ్రీరామచంద్రమూర్తి, శరజ అన్నదానం, రాధికా నడదూర్, రమ త్యాగరాజ పంచరత్న కీర్తనలను ఆలాపించారు. యడవల్లి శేషుకుమారి శిష్యులు త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలను ఆలాపించారు. ఆదిత్య సత్యనారాయణ వయోలిన్, శివ కుమార్, కార్తీక్ మృదంగం వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి రోజా రమణి ఓరుగంటి, సౌజన్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఎంతో గొప్పగా జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపుగా 200మంది హాజరయ్యారు. పలువురు సోషల్ మీడియా వేదికలపై వీక్షించారు.