హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మద్దతుగా దళిత బంధు వంటి సంక్షేమ కార్యక్రమాన్ని రూప కల్పన చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు, ప్రభుత్వానికి ఎన్నారై టీఆర్ఎస్ పార్టీ ఖతర్ ప్రతినిధుల బృందం ధన్యవాదాలు తెలిపింది. దళిత బంధు బడుగు బలహీనర్గాల సంజీవని అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలతో పాటు అర్హులైన, ఆర్ధికంగా వెనుకబడిన ఎన్నారైలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఎన్నారై టీఆర్ఎస్ ఖతర్ ప్రతినిధులు వినతి చేశారు.
గల్ఫ్ దేశాలు, మలేషియా, సింగపూర్ తదితర దేశాలలో లక్షలాది మంది ఆర్థికంగా వెనుకబడిన, పేద ఎన్నారైలు నివసిస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారిని పరిగణనలోకి తీసుకావాలని, వారు అందుబాటులో లేని పక్షంలో దరఖాస్తుకు ప్రత్యేక వీలు కల్పించాలని ఈ సందర్భంగా మంత్రికి విజ్ఞప్తి చేశారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసిన వారిలో టీఆర్ఎస్ పార్టీ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరం నరేశ్, మారుతి మ్యాక, అభిలాష్ బండి ఉన్నారు.