హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము లేకనే బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులతో భయపెడుతుందని మండిపడ్డారు. ఇలాంటి నిరాధార ఆరోపణలతో ప్రజల్లో బీజేపీ మరింత చులకనవుతుందని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీఆర్ఎస్ నాయకత్వంపై బురదజల్లి, మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ది పొందాలని అలాగే తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుందని, ప్రాంతీయ పార్టీలపట్ల కక్ష పూరిత విధానాలను అవలంభిస్తూ ఆయా ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నదని అభిలాష పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ , కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారని అభిలాష గొడిశాల స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఎన్నారై టీఆరెఎస్ కువైట్ తరపున పూర్తి మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు.