ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ సమయంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు సందడి చేశారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘దేశ్ కి నేత కేసీఆర్’, ‘కేసీఆర్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ హంగామాలో అధిక సంఖ్యలో టీఆర్ఎస్ అభిమానులు పాల్గొని మద్దతు తెలిపారు.
అలాగే పీవీ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా విచ్చేసిన టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని భారతీయులంతా కోరుకుంటున్నారని, రోజు రోజుకు ఆయనకు మద్దతు పెరుగుతోందని అన్నారు. ఎన్నారైలతో పాటు దేశ ప్రజలంతా కూడా తమ కష్టాలు తీరుస్తాడనే ఆశతో కేసీఆర్ వైపే చూస్తున్నారని తెలిపారు.
దేశ రాజకీయాల్లో త్వరలోనే కేసీఆర్ సరికొత్త చరిత్ర సృష్టించ బోతున్నారని, మునుగోడులొ కారు గుర్తును అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని నాగేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు డా.అనిల్ రావు చీటి, వినయ్ సన్నీ గౌడ్, విక్రమ్ కందుల, నరేందర్ రెడ్డి, సాయి గుప్తా, విశ్వామిత్ర, సునీల్ రెడ్డి, సతీష్ పులిపకలతో పాటు ఇండియా నుండి విచ్చేసిన తెలంగాణ బిడ్డలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవంబర్లో జరిగే ఉప ఎన్నికలలో మునుగోడు ప్రజలు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకి వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని వీరంతా కోరారు.