Bhogi pandlu | ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య (The Hong Kong Telugu Samakhya) స్థాపించక ముందు నుంచే దాదాపు రెండు దశాబ్దాలుగా భోగిపండ్లు (Bhogi pandlu) వేడుకని చేస్తున్న వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి తమ సంతోషాన్ని తెలుపుతూ ఈ సంవత్సరం నిర్వహించిన భోగిపండ్ల సరదాల విశేషాలు తెలిపారు. ముఖ్య అతిథులు స్థానిక యునెస్కో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తిరునాచ్ దంపతులు ,బాలవిహార్ గురువు శ్రీమతి చిత్ర జికేవీ దంపతులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా పిల్లలకు భోగి పండ్లు పోసే అంశాన్ని కొనసాగించారు.
పిల్లలు సందడిగా చాకోలెట్లు ఏరుకొంటూ, మరి కొందరు అవి తినే ప్రయత్నం చేస్తుంటే వారి అమ్మానాన్నలు వద్దని ఆరాట పడుతుంటే చూడ ముచ్చట కొలిపింది. పిల్లల కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం మరింత ఆనందంగా కొనసాగింది. ముఖ్య అతిథులు కూడా పిల్లలకి భోగి పండ్లు పోసీ ఆశీర్వదించి .. తమకి ఇటువంటి అనుభవం ఎప్పుడు కలగలేదని చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే మరి కొందరు తమకి ఈ వేడుక అనుభవం ఇది తొలిసారి అని, తమ పిల్లలకి అందరితో కలిపి చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
కార్యవర్గ సభ్యులందరు రమాదేవి, రమేష్,రాజశేఖర్, మాధురి అధ్యక్షులు శ్రీమతి జయతో కలసి కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమ నిర్వాహణలో విచ్చేసిన సభ్యులందరు, కొందరు పిల్లలు కూడా తమ వంతు సహాయాన్ని అందించారు. ఈ విశేషాలని తమ కెమెరాలో అద్భుతమైన జ్ఞాపకాలుగా అందించారు శ్రీ రవికాంత్.
వచ్చే వారం తమ వార్షిక తెలుగు కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామని, పిల్లలు తమ సంగీత నాట్య కళలను ప్రదర్శించనున్నారని ఉత్సాహంగా తెలిపారు. ఆత్మీయ పాఠకులందరికి హాంకాంగ్ తెలుగు వారి తరపున సంక్రాతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.