జోహన్స్బర్గ్ : దక్షిణాఫ్రికాలోని తెలుగువారంతా క్షేమంగా ఉన్నట్లు టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలుకు వెళ్లడంతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి అల్లర్లు, దోపిడీలకు దారితీశాయి. ప్రజలు, నిరసనకారులు ఆహారం, వస్త్ర దుకాణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మద్యం, షాపింగ్ మాల్స్పై దాడి చేసి లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా ముఖ్యంగా గౌటెంగ్, క్వాజులు-నాటల్ ప్రావిన్సుల్లో చోటుచేసుకున్న ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, తొక్కిసలాటలో సుమారు 200 మంది చనిపోయారు. ప్రవాసుల క్షేమంపై ఆందోళనలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో గుర్రాల నాగరాజు అక్కడి పరిస్థితిని తెలియజేశారు.
అధ్యక్షుడి నిన్నటి ప్రసంగం తర్వాత పరిస్థితులు సద్దుమనుగుతాయి అనుకున్నాం. కానీ డర్బన్లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మిలటరీ రంగంలోకి దిగినా చాలా చోట్ల చెదురుమొదురు సంఘటనలు జరుగుతున్నాయన్నారు. తెలుగు వారంతా ఎక్కువగా జోహన్స్బర్గ్లో ఉంటారని వారంతా క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఎలాంటి ఇబ్బంది లేదని రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.