Venkaiah Naidu | ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికి సంస్కృతే ఒరవడి అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సువిశాల దృక్పథం, ఉదాత్త భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలదని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన మలేషియా-సింగపూర్ దేశాల్లో పర్యటిస్తున్నారు.
సోమవారం సింగపూర్లో శ్రీసాంస్కృతిక కళాసారధి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. తెలుగు సంస్కృతి, కళలను కాపాడుకోవడంతోపాటు ముందు తరాల వారికి అందించాలన్న శ్రీ సాంస్కృతిక కళా సారధి ఆశయం అభినందించ దగిందన్నారు.
దేశపు ఎల్లలు దాటి విదేశాల్లో మన భాష, సంస్కృతి, కళలకు గౌరవం లభించడం ఆనందంగా ఉందని వెంకయ్యనాయుడు చెప్పారు. రెండేండ్లలోనే సంగీతం, నృత్యం, సాహిత్యం, ఆధ్యాత్మికం, నాటకం, సంప్రదాయ కళారంగాలపై విజయవంతంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నిర్వాహకులు, సభ్యులను అభినందించారు.
మన భాషా సంస్కృతుల పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థలు ఒకే వేదికపైకి రావాలని ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నలుగురి ఆలోచనల సంగమం గొప్ప విజయాలను అందిస్తుందన్నారు. ఆ దిశగా శ్రీ సాంస్కృతిక కళాసారధి వంటి సంస్థలు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇందుకు యువత మరింత చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు.
దసరా-దీపావళి పండుగల సందర్భంగా సింగపూర్లోని తెలుగు వారితో కలిసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా “శ్రీ సాంస్కృతిక కళాసారథి” ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది.
శ్రీ సాంస్కృతిక కళా సారధి నిర్వాహకులను, సింగపూర్ తెలుగు ప్రజలకు వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ కోశాధికారి వామరాజు సత్యమూర్తి ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. సింగపూర్ గాయని గాయకులతో సంప్రదాయ భక్తి గీతాలు, సాయి తేజస్వి, అభినయ నృత్యాలయ వారి నృత్య ప్రదర్శనలు , తేటతెలుగు పద్యాలాపన ప్రేక్షకులందరినీ అలరించాయి.
శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ‘మా సంస్థ 2020లో ప్రారంభమైంది. రెండేండ్లుగా ప్రపంచంలోని పలు తెలుగు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ సుమారు 40కి పైగా కార్యక్రమాలను నిర్వహించింది. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సంస్థ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవాలని వేచి చూస్తున్నాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరింది’ అని ఆనందం వ్యక్తం చేశారు.
సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గం రాధిక మంగిపూడి, రామాంజనేయులు చామిరాజు, భాస్కర్ ఊలపల్లి, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల తదితరులు వెంకయ్య నాయుడును సత్కరించారు.
సింగపూర్ తెలుగు ప్రజలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగం చక్కటి చలోక్తులతో, మన భాష, సంప్రదాయ, సంస్కృతులను కాపాడుకునేందుకు పిలుపునిస్తూ, ఆలోచనాత్మకమైన సందేశంతో అందరిని అలరించింది.
ఈ కార్యక్రమంలో సింగపూర్లోని ప్రఖ్యాత తెలుగు సంస్థలు, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’ ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సాంకేతిక నిర్వాహకులుగా గణేశ్న రాధాకృష్ణ వ్యవహరించారు. యూ-ట్యూబ్ ఫేస్బుక్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ కార్యక్రమాన్ని
https://fb.watch/gcMp92bw5U/ అనే లింక్లో వీక్షించవచ్చు.