ఫిలడెల్ఫియా: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడిన ఆయన.. భాషను కాపాడటంలో తానా చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా తానా ప్రతినిధులు వెంకయ్యనాయుడును ఘనంగా సత్కరించారు.
సద్దురు జగ్గీ వాసుదేవ్ ఆధ్యాత్మిక జీవితం గురించి ప్రసంగించారు. జొన్నవిత్తుల రాసిన పాటకు స్థానికు డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు డ్యాన్స్ చేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ షోకు కూడా మంచి స్పందన వచ్చింది. కృష్ణుడి రూపంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగ్నిజంట్ సీఈవో ఎస్ రవికుమార్, సినీ గేయ రచయిత చంద్రబోస్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ప్రైమ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి, తెలంగాణ అమెరికన్ అసోషియేషన్ (టాటా) వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి తదిరుతరులను సత్కరించారు.
కన్వెన్షన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ సమన్వయ కర్త రవి పొట్లూరి, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ బండ్ల హనుమయ్య తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు. సీని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కచేరి ఆహుతులను అలరించింది.
కేసీఆర్ పాలనలో తెలంగాణ పురోగమిస్తోంది: మంత్రి ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తానా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. తనా మహాసభలు ప్రత్యేకమైనవని, మనం ఎక్కడున్నా అంతా ఒక్కటే అని చాటుతున్నాయని ఎర్రబెల్లి అన్నారు. ప్రవాసులు స్వదేశం, రాష్ట్రాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అందరం కలిసి తెలుగు రాష్ట్రాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దగలమని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ప్రవాసులు గర్విస్తున్నారని ఎర్రబెల్లి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. సమావేశంలో తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్, ప్రవాస నేతలు పాల్గొన్నారు.